7 అక్టో, 2011


Andhraprabha

Last Updated Oct 07 2011, 21:42:03, IST


శివతాండవ స్పూర్తి పుట్టపర్తి

apr -   Mon, 28 Mar 2011, IST
లైఫ్
ఆధునిక మహాకావ్యంగా పండితులు ప్రశంసించే శివతాండవ కావ్యం ఒక సరికొత్త భావావిష్కరణకు శ్రీకారం. దాని సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. శివతాండవం చదివేవారిని శివాలెత్తిస్తుంది. చదువుతున్నంత సేపు గుక్క తిప్పుకోనీయదు. ఆ కావ్యంలో ఉండే లయ, నాద సౌందర్యం, పదాల పోహళింపు అటువంటివి. ఆ లయ, ఆ శయ్యా సౌభాగ్యం అనితరసాధ్యం.
ఆకాశమంతాను నేనైతే
అంతా చుక్కలే చెక్కుతానేమో
సెలయేరులంతా నేనైతే
అంతటా కన్నీరె చిలుకుతానేమో
ఈ లోకమంతాను నేనైతే
అంతటా నా ప్రేమ నింపుతానేమో
అని అనగల సత్తాగల మహాకవి పుట్టపర్తి. ఆబాల గోపాలంతో జేజేలు పలికించుకున్న పుట్టపర్తి నారాయణాచార్యులు 1915, మార్చి, 28వ తేదీన అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మీదేవి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. ఆయన ఇంటి పేరు తిరుమల వారు. కృష్ణదేవరాయల రాజ గురువు తిరమల తాతాచార్యుల వంశం ఆయనది. ఆ తర్వాత ఆయన వంశీయులు చిత్రావతీ తీరంలోని పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది. తిరుపతి సంస్కృ కళాశాలలో సంస్కృతం నేర్చు కున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం. చందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వెెసే వారు.
ఆయన మొదట పని చేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్య్రం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ మీనన్‌కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివి తీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్లు తిరువాన్కూర్‌లోనూ, కొన్నాళ్లు ఢిల్లిd లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీరామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్‌ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. హృషీకేశ్‌లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు ''సరస్వతీ పుత్ర'' బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువ దించారు. ''లీవ్స్‌ ఇన్‌ ది విండ్‌', దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన ''ది హీరో'' ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జె.పిట్‌ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ భార్య. ఆమె కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో బ్రౌనింగ్‌ పై రీసెర్చ్‌ చేసి డాక్టరేట్‌ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్‌ ఇన్‌ ది విండ్‌ కావ్యం చూసి హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
ఆయన చరిత్రను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ 'సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చుకున్నాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?'' అని అడిగారు. టీచరు నోరువెళ్ళబెడితే 'కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్లూ'' అని విడమరచి చెప్పి టీచరుకు జ్ఞానోదయం కలిగించారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ పుట్టపర్తి వారిని కవిగా కన్నా చారిత్రకుడిగా గౌరవిస్తానన్నారు. గుర్రం జాషువా ''పుట్టపర్తి నారాయణాచార్యు లకంటే గొప్ప వాడెవ్వడు?'' అని ప్రశ్నించాడు. పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని అయిన పెనుకొండ దీనావస్థను చూసి హృద యం ద్రవించి ''పెనుకొండలక్ష్మి''అనే గేయ కావ్యం రాశారు. ఆయన విద్వాన్‌ పరీక్షలు వ్రాసేటప్పుడు ఈ కావ్యమే పాఠ్యపుస్తకంగా రావడం విచిత్రం. ఇంకా గొప్ప చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం ''పెనుకొండ లక్ష్మి'' నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూ ఉండిపోవడంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. దాంతో ఆయన పాస్‌ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్లే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వ నాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించాడు. ఒకసారి విజయవాడలో పుట్టపర్తి తన ''శివ తాండవం'' గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపై కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్‌ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్న ప్పుడు ఉపన్యాసం ముగిశాక ప్రాకృత భాషలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్నవాళ్లు ''ఆ శివుడు ఆడితే చూడాలి. ఆచార్యులవారు పాడితే వినాలి అని భావించేవారు. ఆయన 140 పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్‌. ప్రదానం చేశాయి. ఆయన కడపలోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్‌గా పని చేసి 1990 సెప్టెంబర్‌ 1న స్వర్గస్థుల య్యారు.
-డాక్టర్‌ వంగల రామకృష్ణ



కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి