27 జన, 2012

 
ఏ రచయిత అయినా ..
తన కాలానికి సంబంధించిన సమస్యలకే..
ప్రతిస్పందించి రచన చేస్తాడు కదా ..!
అటువంటప్పుడు..
ఆ రచనకి శాశ్వత కాలం నిలిచే శక్తి ఎలా వస్తుంది. 

జరిగే ప్రతి సన్నివేశానికీ ..
కవి హృదయం స్పందిస్తుంది. 
సందేహం లేదు ..


కానీ ..
ప్రతి స్పందనకూ ..
కావ్యత్వం యిస్తే ..
వాని స్పందన..
మనసులో ఎంతకాలం పని చేసిందో..
అంత కాలమే..
ఆ కావ్యానికి కూడా ఆయుష్షు వుంటుంది. 

కలిగిన ప్రతీ స్పందనను ..
రాయడం విజ్ఞతకు లక్షణం కాదు.
అందుకే అనుభవం కావాలంటారు. 
వయస్సు కొంత ముదరవలె ..
అప్పుడప్పుడూ..
చేకూర్చుకున్న సంస్కారం ..
ఒక పరిణతమైన స్థితికి వస్తుంది.
ఆ స్తితిలో రచన చేయ వలె ..

సమకాలిక సంఘటనే కావలసిన అక్కరలేదు. 
పూర్వకాల సంఘటన అయినా తీసుకోవచ్చు.
ఏది తీసుకున్నా ..
అందులో తన సంస్కారం చోటుచేసుకుంటుంది. 
ఈ విషయం ఇంకా విస్తరిస్తే పెద్దగా చెప్పవచ్చు. 

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను...
మళయాళం లో భాగవతం..
"ఎళుత్తచ్చన్" వ్రాసినాడు. 
అందులో కృష్ణుడు ఏడ్చినప్పుడల్లా..
యశోద అరటి పండు ఇస్తుందట..
కారణం ..
వాళ్ళ దేశాచారమది...

ఇలాంటివి ఎన్నో ఉంటాయి..
కలిగిన ప్రతి భావననూ ..
కాగితం మీద పెట్టడం ..
అదంతా ప్రింటు కివ్వడం..
చాలా అనాగరికమైన అలవాటు.
ఒక కవి పరిణతుడు కావడానికి ముందు...
ఎన్నో వ్రాసి చించి వేయాలి.

నేను ఎన్నో సార్లు ..
నా రచనలు అనేకం చించివేసాను. 
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కావ్యాలే చించి వేసారు. 
రాసిందంతా ప్రెస్సుకు పోవాలనే..
నేటి యువకుల్లో కనిపించే దురాశ.
 
ఇప్పటి కవిత్వం దుస్థితిలో ఉందని ..
సాహితీ విలువలు పడిపోతున్నాయని..
చాలా మంది అంటున్నారు..
నిన్నటి మహా రచయితలు కూడా..
నేటి సాహిత్యం పై సదభిప్రాయాన్ని చెప్పటం లేదు. 
ఈ విధంగా ..
సమకాలీన సాహిత్యాన్ని యోగ్యంగా లేదనడం ..
కొన్ని దశాబ్దాలుగా కూడా వుంది. 
ఇదంతా చేమకూర వేంకట కవి చెప్పినట్టు..
ఏ గతి రచియించిరేని..
సమకాలము వారలు మెచ్చరే కదా..
అని అనుకోవచ్చా..
 
ఈనాడు వచ్చేదంతా ..
మంచి సాహిత్యం కిందకి చేరడం లేదనే మాట..
వివేకంతో కూడినదే ..
రాసే వాళ్ళకే విసుగైపోతున్నదన్నమాట.. 
ఇది ఒక శుభ పరిణామం..
ప్రమాణాలు పడిపోతున్నాయనే రొద కూడా..
వాళ్లలోనుంచే ఆరంభమౌతోంది..!

కానీ ..
వాళ్ళ దృష్టిలో ..
ప్రమాణాలనేవి ఏవో సరిగా చెప్పడం లేదు 
అక్కడే మళ్ళీ అస్పష్టత వుంది. 
వారనుకునే ప్రమాణాలు ఏవో..
కొంత విడదీసి చెబితే..
మా బొంట్లకు బాగుంటుంది. 

ఎంతసేపు చెప్పినా..
భాష ..
భావం ..
రెండే ప్రధాన వస్తువులు..

మరి భాష పడిపోయిందా..?
భావం పడిపోయిందా..?
వాళ్ళే తేల్చి చెప్పాలి. 
నా దృష్టిలో రెండూ పడిపపోయినాయి..

కొన్ని చిన్న కథలు..
నవలలు మాత్రం..
మంచివి వస్తున్నాయనిపిస్తోంది.
 
మీకు కోపం వస్తుందేమో..
నవలా సాహిత్యం ..
కన్నడంలో ..
తమిళంలో ..
బాగా వస్తొందనే అభిప్రాయం నాకుంది. 
ఇక కవిత్వ మంటారా.. 
ప్రతి భాష లోనూ ఇంతే అయిపోతొంది. 

ప్రతి భాషలోనూ ..
రాజకీయాల ప్రభావం ..
ఎంతవరకూ విసంకటంగా సాగుతుందో..
అంతవరకూ..
ఈ దుస్తితి తప్పదు.

వాల్మీకికి ముందు..
కావ్య రచన లేదంటారు కదా.. 
అటువంటప్పుడు ..
ప్రధమ రచన అయిన ఆదికవి వాల్మీకి రామాయణం ఇంతవరకూ కూడా..
స్థిరంగా నిలిచి వుండడానికి కారణం ఏమిటి..?
ఆ విధంగా సమగ్ర రచన చేసే శక్తి ..
వాల్మీకికి ఎలా సంక్రమించింది..?

ప్రాచీనులతో మనకు చిక్కే లేదు.. 
సరస్వతీదేవి ఆవిర్భావమే..
వాల్మీకితో ఆరంభమయ్యిందంటారు కదా..!
ఆ  ఆవిర్భావమే ..
సర్వాంగ సుందరంగా జరిగింది. 

కేవలం లౌక్య దృష్టితో ఆలోచిస్తే ..
నాకు తోచే అభిప్రాయమిది ..

సామవేదం కేవలం గానాత్మకం..
అధర్వణం ప్రయోగాత్మకం..
ఋగ్వేదం శృత్యాత్మకం..
వీటి అధ్యయనం వాల్మీకికి వుంది. 
కనుక రామాయణ రచన ..
సమగ్రంగా జరిగి వుంటుందని నా ఊహ..

ఇది నా ఊహ మాత్రమే సుమండీ..

కానీ ఒకటి నిజం ..
వాల్మీకి వలె ..
సర్వాంగ సుందరమైన రచన..
మరొక్కనికి చేయడం అసాధ్యం 

మరి ..
ఆయన సంస్కారమేమిటో ..?
ఆయన చదువేమిటో ..?
మనం గ్రహించలేం..
 
కొన్ని కొన్ని చోట్ల..
ఋగ్వేదంలో..
మనకు మంచి కవిత్వం దొరుకుతుంది. 
నా చిన్నప్పుడు ఋగ్వేదంలో..
కొన్ని ఘట్టాలు చదివి ఆశ్చర్య చకితుణ్ణి అయ్యాను. 
ఉషస్సూక్తులు మొదలైనవి...

అప్పుడే తెనిగించే సాహసానికి పూనుకున్నాను. 
తర్వాత ఎందుకో..
ఆ ప్రయత్నం నిలిచి పోయింది.
 
కడుపులో చల్ల కదలకుండా వున్న కాలంలో..
పురాణాలు ప్రబంధాలు రాశారు ..
అని ప్రాచీన సాహిత్యాన్ని ఎత్తి చూపే వారికి..
మీ సమాధానం ఏమిటి..?
అంతకు మించిన గొప్ప విలువలు..
నేటి రచనలు ప్రతిబింబిస్తున్నాయా..?

ఆనాటి వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా ఉండడానికి కారణం ..
ఆనాటి రాజకీయాలు..
అంతే కాకుండా ..
అప్పటి వాళ్ళంతా కడుపులో చల్ల కదలని వాళ్ళే అనుకోవడం మన మూర్ఖత్వం. 
ఫ్యూడలిజం..
పెట్టుబడిదారీ సమాజం..
ఆనాటి నుంచీ ఇప్పటి వరకూ అనుభవిస్తూండేదే.
ముఖ్యంగా ..
నేటి మన జీవితంలో జీవశక్తి నశించింది..
జిజ్ఞాస పోయింది..
సుఖాన్ని కూడా చక్కగా అనుభవించలేని పరిస్తితికి వచ్చినాము ..
మన దౌర్భల్యానికి సిగ్గు పడకుండా..
వాళ్ళని నిందించడం..
"అబధ్ధం పఠత్వా కుతోద్యం కరోతి"
అన్నట్టు ఉంటుంది. 

కడుపులో చల్ల కదలక కాదు..
  చల్లే లేకుండా..
గొప్ప వాళ్ళైన వాళ్ళను..
ఎంతమందినో నేను చూసినాను.
ఇవన్నీ కూడా ..
ఆడలేక ..మద్దెల పైన మొత్తుకునే మాటలు..
ఇటువంటి వాని పైన నాకు సానుభూతి లేదు...
 
ఇలా ..
ఎంతో వివరంగా..
సునిశిత మేధాశక్తి ఉట్టి పడేలా..
నిష్కర్షగా ..
ఎన్నో సాహితీ విషయాలను వివరించారు. 
తెలుగు జాతి ఏనాటికీ మరువలేని మహా కవి..
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు...

ఆ సరస్వతీ పుత్రుని మాటలు.. 
అపూర్వ మేధా సంపత్తిని ప్రకాశింపజేసే..
మాణిక్యాల మూటలు..
ఆ విలువైన మాటల్ని ..
పాఠకులకు అందజేయాలని..
ఆయన దగ్గర సెలవు తీసుకుని..
బయలుదేరింది స్వాతి.
 
స్వాతి మాస పత్రిక అయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లోని కొన్ని ఇవి...