28 మే, 2012

పుట్టపర్తినారాయణాచార్యులు -విష్ణు చిత్తులతో ఒక పర్యాయము..పుట్టపర్తి అనూరాధ.



వైష్ణవమంటే అయ్యకు ఎనలేని ప్రేమ..
"పల్లాండు.. పల్లాండు.. "..
అని అయ్య చిరునవ్వు ముఖంతో ..
ఆవేశంగా చెప్పటం గుర్తొస్తోంది..
అలా అని 

అర్థంలేని కట్టుబాట్లని అయ్య ఒప్పుకోరు..
ఏ మతాచారమైనా ..
భక్తి భావనకే పెద్ద పీట వేస్తుంది.
 
అందులోని ఆత్మని వదిలేసి ..
కేవలం ఆచారాలలోనే 
జీవితాన్ని వెళ్ళబుచ్చటం ..
అయ్య వలన ససేమిరా కాని పని.
 

అందరూ పిలక పెట్టుకుని ..
నామాలు పేద్ద పేద్దవి నుదుటన ధరించి కనిపిస్తే ..
అయ్య క్రాపుతో ..
నామాలకు ..కామాలు..,,
 కాదు ..పులుస్టాప్ పెట్టేశారు..!!
 
కానీ..
కంచి చంద్రశేఖర పరమాచార్యుల వారివద్ద.. క్రాపుపెట్టుకున్న అయ్యకే ప్రధమస్థానం ..
మొదటిపిలుపు అయ్యకే..
 
అయ్య విష్ణు చిత్తులను చెపుతూ..
విష్ణు చిత్తుల భాష చాల సుందరమైనది ..
ఆయన పదముల నొక్కొక్కసారి..
యవిసిపూవులవలె రాల్చును. 
చిలుకలు గుంపులవలె పైకి లేపును..
ఈ పరిణామము వీరియందే కాదు. 
కృష్ణ స్వరూపమును ప్రేమించిన 
అందరు భక్తుల యందును 
అన్ని భాషల యందును గనిపించును అంటారు.

"పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు
పలకోడి నూఱాయిరం
మల్లాండ తిణ్ణోళ్ మణివణ్ణా!
ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు"

"అడొయోమోడుం నిన్నోడుం పిఱివిన్ఱి ఆయిరం పల్లాండు
వడివాయ్ నిన్వల మార్భినిల్ వాల్ గిన్ఱ మంగైయుం పల్లాండు
వడివార్ శొది వలత్తుఱైయుం శుడరారియుం పల్లాండు
పడైపోర్పుక్కు ముళంగుం అప్పాంజశన్నియముం పల్లాండే.."
అంటూ స్వామికి మంగళం పాడాడు.

విష్ణుచిత్తులవారు పాడిన ఆ పల్లాండు పాటనే 
ఈనాటికి మన వైష్ణవ ఆలయాల్లో పాడటం ఆచారం.

పల్-ఆండు అనేక సంవత్సరాలు, 
పల్-ఆండు అనేక సంవత్సరాలు  
పలకోటి నూరు- ఇలా కోట్ల సంవత్సరాల వరకు 
నీకు మంగళం. 

ఈ దాసులకు నీకు మధ్య ..
ఎప్పటికీ వీడని బంధానికి మంగళం..
నిన్ను ఎప్పటికి వీడని అమ్మ 
లక్ష్మీదేవికి మంగళం.. 
శత్రువులని వణికించే 
నీ శంఖ,చక్రాలకు మంగళం..
అంటూ ఆయన పాడారు. 

అంతే కాదు..
తనని యశోదగా భావించి ..
కృష్ణుడిపై ఎన్నో పాటలు 
తని ద్రవిడ ప్రబంధాలుగా 
లోకానికి అందించాడు. 
నిరంతరం విష్ణువుపై చిత్తము నిలిపి ఉన్న కారణాన 
ఈయనకు విష్ణు చిత్తుడని పేరు వచ్చింది.
 పరమ భక్తుడు ..
అందుకే పెరియాళ్వార్ అన్నారు.
 
శ్రీమహావిష్ణువు వైకుంఠంలో ..
భక్త కోటిని అనుగ్రహించే వేళ గరుత్మంతుడు..
తాను విష్ణువును అల్లునిగా పొందాలన్న ..
భావనను వ్యక్తపరిచాడు..
శ్రీమహావిష్ణువు కలియుగంలో ..
నీ కోరిక తీరుస్తానన్నాడు. .
హిరణ్యాక్షుడు ..
సముద్రంలో ముంచిన భూమిని పైకి తీసుకొచ్చేవేళ భూదేవి ఆయన దివ్యస్పర్శనొందిన పరవశతన వివాహమాడమని కోరింది.
 
గరుత్మంతుడు విష్ణు చిత్తునిగా ..
కలియుగంలో వచ్చి ..
తనకు తులసీవనంలో పసిపాపగా ..
దొరకిన భూదేవికి  గోదాదేవి 
అని పేరుపెట్టి విష్ణుచిత్తులు 
ఆమెను విష్ణుభక్తురాలుగా పెంచి పెద్ద చేశాడు.

శ్రీవిల్లి పుత్తూరులోని ..
వటపత్రశాయిని సేవిస్తూ ఉన్నాడు. 
మార్కండేయ మహర్షి తపః ఫలంగా 
ఆ వటపత్రశాయి అక్కడ వెలిశాడు..  

తులసీ మాలలతో..
 శ్రీ మహా విష్ణువును అలంకరిస్తూ 
గోదాదేవి విష్ణువునే భర్తగా భావించటం 
విష్ణుచిత్తుడు 
తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి 
శ్రీరంగనాధుని అల్లునిగా పొందటం మనకు తెలుసు . 

మాలాకైంకర్యముచే కృష్ణభక్తి కలవాడై 
కృష్ణలీలలను అనుభవించి 
పెరి ఆళ్వారు 472 పాశురములతో 
పేరియాళ్వారు తిరుమళి ప్రబంధమును భక్తులకిచ్చాడు. 

శ్రీమాన్ పుట్టపర్తివారు 
శ్రీ విష్ణుచిత్తుల కవితా వైశిష్ట్యము 
అన్న వ్యాసం వ్రాసారు. 
అది శ్రీ వైష్ణవ ధర్మ విజ్ఞాన సర్వస్వం 
డిసెంబరు 1988 న ముద్రితమైంది.
 
అందులో ..
యశోదగా తనను తాను భావిస్తూ 
విష్ణుచిత్తులవారు చేసిన వర్ణనలను 
పుట్టపర్తి వారి కలంద్వారా వినడం ఒక అనుభూతి..
                                    ***

శ్రీరాముడు మొదలగు అవతారములపై ...
విష్ణుచిత్తునకు మనసున్నను .
వారికి మరులు కృష్ణునిపైనే ..

ఆ కృష్ణుడు చాల దుర్మార్గుడు ..
వాడు తల్లి మాట వినడు..
ఊరి వ్రేతలలో వయసు చిన్నదైనను..
పెద్ద సేతలు సేయును..
 ప్రక్కింటి పొరుగింటి పిల్లలను యేడ్పించును.

 (ఇళం పిళ్ళై యెళుప్పి, కణ్ణె పురట్టి విళత్తుక్కళ్ళక్కండు సెయ్యుంపిరానె)

వారిని కన్నులెర్రజేసి బెదరించును..

 (కన్రుగళో రచ్చె విల్ ,కట్టెరుంబు పిడిత్తిట్టాల్,తిన్రిక్కిడు.మాకిల్ వెణ్ణెయ్ తిరట్టి విళు కుమాకాల్పన్) 

ఆవు దూడల చెవులలో ..
ఎర్ర చీమలు పట్టి వేసి యేడ్పించును..

(వెణ్ణైయలైంద కుళుంగుం విళైయాడు పుళుదియుం కొండు) 

యశోదమ్మ ..
తలకు బోయుటకై యొడలికి నూనె బూయగా..
మన్ను రాచుకొని తిరుగులాడును ..
కనబడిన యాడువారికి సైగలు సేయును..

అందులో వయసు తారతమ్యముగూడ లేదు..
ఈ చేతలలో..
దినమొకరు యశోదమ్మ ఇంటిపైకి వత్తురు..
 
ఆమెకు కొడుకుపై గల అభిమానము..
 గంపెడంత ..
విష్ణు చిత్తుల కృష్ణుడు..
దక్షిణదేశమున మాత్రమే దిరిగెను. 
బృందావనమువేపు అడుగే పెట్టలేదు..
కృష్ణునిలో ఎన్ని పిల్లాటలున్నను..
 వాడు "వాయి మడచి " పిల్లనగ్రోవి పలికించెనా..
ఆ స్వామియే వేరైపోవునట. 

శ్రీ కృష్ణుని పై ఇన్ని దూరులు చెప్పిన గోపికలు..
యెదలు జార ..
ఒడలు మరచి ...
లోక నీతిని విడచి ..
చెమటలు గార..
వచ్చి వారి యెదుట నిల్తురట..

(ఇళన్ కొంగై కుతుక లిప్ప ఉడలుళ విళ్నుయోగుం కావలుం కడంచు కయిరుమాలై యాహి కనిత్ను నిన్రయిరే) 

వారి కప్పుడు కొప్పులు వదలిపోయినదియు తెలియదు.

 (మలర్ కూందల్ అవిల) 

వీరు మాత్రమే కాదు. 
రంభాదులైన యప్సరసలు గూడ నిలుతురు. 

(అటల్ పాటలైమార్తి నణ్తమే) 

వారు తమ నర్తనములనే మరచిపోవుదురట 
నారదుడు ..తుంబురుడును..
తమ తమ వీణెలు కఠ మరచి ..
నిర్విణ్ణులై నిలచిపోదురు..
(తుంబురువోడు నారదనుంతంతం వీజైమరంతు) 

చెట్లపై నున్న పక్షులు కూడు మరచి..
గూళ్ళలోనేవుంది నిశ్శబ్దముగ వినునట..

(మాంకంగళ్ మేయ్గై మరందు.మేయ్త వుల్లుం కటై వాయై వళితోడ ఇరండు,పాడుం తులుం కాప్పుడై పెయారా, ఎళుదు సిత్తిరంగళ్ ఫోల విన్రనవే..) 

హరిణములు మేత మరచి ..
సగము కొరికిన గడ్డి యట్లే నెలవులందుండగా..
వ్రాయబడిన చిత్రములవలె నిలచి ..
వాని వేణుగాన మాలించునట..
చిత్రమైన సృష్టివంటి వాని వేణుగానము..
సర్వ సమ్మోహనము. .