10 ఆగ, 2012

పుట్టపర్తి వారిపై చంద్ర శేఖర పరమాచార్యుల వారి పితృవాత్సల్యం






చంద్ర శేఖర పరమాచార్యుల వారికి 
పుట్టపర్తి వారిపట్ల అపారమైన ప్రేమ..
ఎప్పుడో ..
పుట్టపర్తి వారి తొమ్మిదేళ్ళ ప్రాయంలో..
 ఒకసారి వీరిద్దరు కలవడం జరిగింది..!
తమ ఊరికి దయచేసిన పరమాచార్యులను 
తండ్రి వెంట వెళ్లి దర్శించారు పుట్టపర్తి 

ఆనాటి ఆ బాలకుణ్ణి .. 

వీడు మహాప్రాజ్ఞుడౌతాడని ..
ఆనాడే వారు ఆశీర్వదించి చెప్పారట..
జరగలేదా..?


మళ్ళీ ..
నీ నలభయ్యయిదవయేట ..
ఆర్థికంగా నష్టపోతావన్నదీ వారే..
అక్షరాలా జరిగిందది..


చివరిది.. 
ఇంకా విచిత్రం..
 ''చివరి దశలో 
నీకు కృష్ణ దర్శనమవుతుందన్నది..!!''


అదీ  జరిగి..
మాయదారి కలికాలంలోనూ  భక్తపుంగవులుంటారనీ ..
వారికి పరమాత్మ సాక్షాత్కరిస్తాడనీ 
నిరూపించింది వారి ఆశీర్వాదం..



గురువులు వేసే ప్రశ్నలు 
చమత్కారంగా వుంటాయి
అందులో అవి పరంపరగా వస్తే ..
అందులో కూడా ఏదో రహస్యముంటుంది. 
ఒక ప్రశ్న వేస్తేనే ప్రమాదం
జవాబు చెప్పడం తేలికగా వుండదు.

ఒకసారి ఒకాయన దగ్గరకెళ్ళాను 
మహాపురుషుడతను
సభలో వుంటే ఎవరో వెళ్ళి చెప్పారు. 
రామాయణం చెప్పాడండీ 
భాగవతం చెప్పాడండీ 
ఇంద్రుడండీ చంద్రుడండీ..అని
యేవిటి చెప్పడం 
ఇంట్లో పుస్తకం చూసుకొచ్చి 
నాలుగు మాటలు చెప్పటమూ గొప్పేనా..
కానీ ఇదొక ప్రారబ్ధం..
రమ్మని సైగ చేసారు
మిమ్మల్నే అన్నారు.
ఆయనతో పరిచయమే లేదు..
నన్నెందుకు ఇలుస్తారు..
వెళ్ళాను రూములోకి
వెళ్ళగానే తలుపు వేసారు
గురువు వేసే ప్రశ్న సామాన్యం కాదు 
వెయ్యి టన్నుల బరువుంటుంది.
మీరెవరు..
అన్నారు
నేనేం జవాబు చెప్పను.
ఎవరో అయితే నేను ఫలానా అండీ 
నా ఉద్యోగం ఇదీ అనేవారు
కానీ నా ఉద్యోగానికీ పీఠాధిపతికీ యేం సంబంధం.
 నేనేం చెప్పాలి
విచిత్రం ఏంటంటే
నాకేం చెప్పాలో తెలీలేదు 
ఇన్ని ఉపన్యాసాలూ చెప్పేవానికి
మీరెవరంటే యేం చెప్తాం
నేను ఇంద్రియములు కాను 
మనస్సును కాను 
బుధ్ధిని కాను
శివానంద రూప శివోహం శివోహం 
అంటే నేర్చుకున్న నాలుగు ముక్కలూ
ఆహా అంతటి వాడివా
అని పరీక్ష పెడితే 
లేని పోని గొడవ 
అని వెయ్యి ఆలోచన లొచ్చి 
నిశ్శబ్దంగా నిలబడ్డాను.
నీ పేరేంటి అన్నారు
చెప్పాను
అది నీ పేరా నీ శరీరం పేరా..
ఆయన ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో చూడండీ..
మూడో నంబరు ప్రమాద సూచిక పడిపోయింది.
నోరువిప్పి మాట్లాడేటప్పుడు జాగ్రత్త.
యోగ్యుడవని పిలిచాం 
జాగ్రత్తగా మాట్లాడాలి సుమా
భగవంతుని దయవలన 
వారి ఆశీస్సులతో బయటపడ్డాం 
అంతవరకూ చాలు.
శంకరాచార్యుల వారు 
భజగోవిందంలో కాశీలో ఒక బ్రాహ్మణుడిని 
అడ్డం పెట్టుకుని ఒక ప్రశ్న వేసారు..

కాతే కాన్తా కస్తే పుత్రః
సంసారోయమతీవ విచిత్రః .
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చిన్తయ తదిహ భ్రాతః

నువ్వెవరు..?
మీ ఆవిడెవరు..?
మీ పిల్లలెవరు..?
నువ్వెక్కడినుంచొచ్చావ్..?
ఒకసారి కూచుని ఆలోచన చెయ్

అయిపోయిందంతే 
భయమేస్తుంది..
ఆఖరికి నేనెవరండీ 
అని ఎవరినో అడగడానికెళ్ళాలి..
ఒక మహానుభావుని అనుభవమిది ..

అల్లా వుంటాయి గురువుల ప్రశ్నలు..


వాగర్థా వివ సంపృక్తౌ 
వాగర్థ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వందే 
పార్వతీ పరమేశ్వరౌ..

అని కవి కుల గురువు 
కాళిదాసు వర్ణను అనుసరించి 
ఈ శివతాండవ కావ్యంలో 
ఆచార్యుల వారు అర్థ నారీశ్వర తత్వాన్ని 
చక్కగా ఆవిష్కరించారు. 
అందుకే కంచి పరమాచార్యులు 
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు 
తమ నిత్య పారాయణలో భాగంగా 
శివతాండవం ను గ్రహించారు. 
ఎంతటి అదృష్టం ఆచార్యుల వారికి 
ఎంతటి గౌరవం కావ్యానికి కలిగిందో 
వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది..

"సరసభారతి" గబ్బిట దుర్గా ప్రసాద్..


                           శ్రీ పుట్టపర్తి వా రితో 
            శ్రీ కంచి కామకోటి స్వామి విద్వద్గోష్టి..

ప్రొద్దుటూరులో ..
వైకుంఠ ఏకాదశి నాడు ..
(తే.23.121966) 
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ..
జగద్గురు శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారికి
 శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులకూ ..
జరిగిన గోష్టిలోని విశేషాలను 
ఈ క్రింద ప్రకటిస్తున్నాము.
ఎడిటర్
ఆంధ్రప్రభ దినపత్రిక 12.1.1967

ఆనాడు ..
జగద్గురువులు ఉపన్యాసానంతరం 
పుట్టపర్తి వారిని 
తమ సన్నిధానానికి రావలసిందిగా కోరారు.
అప్పుడు ..
స్వామి వారికీ పుట్టపర్తి వారికీ 
అనేక విషయాలమీద చర్చలు జరిగినవి.

శ్రీవారు :   ప్రాకృత భాషలో నీవు చక్కగా 
                పరిశ్రమ చేసినావని విన్నాము.

పుట్టపర్తి :  తమ ఆశీర్వాదము వలన 
                 కొంత వరకు నిజమే..
                 బౌధ్ధ జైనమతముల పై శ్రధ్ధతో 
                 ప్రాకృత భాషలనవలోకింపవలసివచ్చెను 
                 పరిశ్రమ క్రమక్రమముగా 
                 ప్రత్యేక అభిరుచిగా మారినది.

శ్రీవారు :   బౌధ్ధ మతస్థులు  సంస్కృతమునంతగా
 
               గౌరవించరనుకొంటాము..                  

పుట్టపర్తి : చిత్తము 
                తమకు తెలియని విషయము లేదు 
                మీరేదోనన్నొక పదార్థముగా భావించి  
                ప్రశ్నించుచున్నారు. 
                సంస్కృతము దేవ భాషయని 
                 మనయందరి అభిప్రాయము..
                 దేవతలు 
                 అర్ధమాగధీ భాషలోమాట్లాడుదురని 
                 వారా భాషను శిఖరాగ్రములకెత్తినారు.

శ్రీవారు :    గాధాసప్తశతిని సంకలనము 

                చేసినది  హాలుడేకదా..             

పుట్టపర్తి : చిత్తము ..
                హాలుని కాలమున 
                ననేకమంది స్త్రీలు కూడ  
                గాధలను రచించుచుండిరి. 
                హాలుడు సంకలిత మొనర్చిన వానిలోను 
                సుమారు ఇరువది ముప్పది మంది 
                 స్త్రీల పేరులు వచ్చును. 
               ఆనాటి రమణీయ జీవితములను గురించి                    వారెన్నియో గాధలనల్లినారు.

శ్రీవారు :  కుంతల దేశమేదని నీ యభిప్రాయయు 
             (ఈ ప్రశ్న వేయుచు శ్రీవారు నవ్వినారు)

పుట్టపర్తి :  తమకు 

                తెలిసియే  అడుగుచున్నారు.                  
                కుంతల దేశమనగా 
               మన హంపీ ప్రాంతమే 
               కొంత మహారాష్ట్ర దేశమున గలసి యున్నది 
               ఆంధ్ర దేశమందలి రెడ్లు 
                మహారాష్ట్రులేమోనని నాయనుమానము...                 శాసనములలో క్రమముగా ..
                రాష్ట్ర కూట రట్ట రట్ట-రడ్డి రెడ్డి 
                ఇత్యాది ప్రయోగములు కనపడుచున్నవి.

శ్రీవారు.. : నీవు భాషా శాస్త్రమును 
               ఎందుకు అభ్యసించితివి.

పుట్టపర్తి : తిరువాంకూరులోని యుద్యోగమునకు 
                అది కావలసి వచ్చెను.

శ్రీవారు :  తమిళములో "జ్ఞ"
               అను అక్షరము శాసనములలో 
               ఎ న్ని రూపములెత్తినది

పుట్టపర్తి  : తమిళములోని "జ్ఞ" కారము 
                తెలుగులో "ళ-ర-డ" గా మారినట్లు 
                 కనబడుచున్నది. 
                 చోజ్ఞ శబ్దము 
                 తెనుగు శాసనములలో 
                 క్రమముగా చోళ, చోర , చోడ 
                 ఇత్యాది రూపములలో నున్నది 
                 తెనుగు చోడులు 
                 రేనాటి చోడులు మున్నటివారు.
శ్రీవారు :    నీ యగస్తీశ్వర సుప్రభాతములోని 
               "శేషశైల శిఖరాద్రివాసినః" 
                 అను శ్లోకము చెప్పుము

పుట్టపర్తి : "శేషశైల శిఖరాధివాసినః
                  కింకరాః పర్మవైష్ణవాపయం
                  తత్తధాపి శశిఖండశేఖరే
                  శాంకరే మహసిలీయతే మనః"

శ్రీవారు :    ఈ శ్లోకము చాల బాగున్నది ..
                 లీలాశుకుడుగూడనిట్లే
                 చెప్పుకున్నాడు.           
                 అతడు ద్వైతియై కృష్ణునుపాసించెను. 
                 నీవు వైష్ణవుడవై శివభక్తిని చేపట్టితివి. 
                 మీ మనస్తత్వములు చిత్రముగా వున్నవి.

పుట్టపర్తి : (నవ్వుతూ) 
               నేడు దైవము నందలి విశ్వాసమే 
                సన్నగిల్లి పోవుచున్నది. 
                ఈ స్థితిలో మరలా ..
                 అవాంతర భేదములతో బాధపడుట 
                 మంచిది కాదని నా విశ్వాసము  
                 మీ వంటి అవతార పురుషుల 
                 ఆదేశము కూడా అదే కదా..!!

శ్రీవారు :   నీవెన్ని భాషలలో పరిశ్రమ చేసితివి ?

పుట్టపర్తి :  పరిశ్రమమేమున్నది...? 
                తమ దయ వలన చదువుకున్నానంతే..
               పదునాలుగు భాషలలోనికి తొంగిచూచినాను.
               ఈ పరిశ్రమ వలన ..
               నేను సంపాదించినది అశాంతి మాత్రమే. 
               మేధస్సు బహు ముఖములుగా వ్యాపించి 
               లక్ష్యసిధ్ధి తప్పిపోవును.

శ్రీవారు :   నిజము .. నిజము.. 
                సంస్కృతములోని "య"కారమునకు 
               ప్రాకృతములో "జ" కారము వచ్చును కదా 
               ఈ సంప్రదాయము 
               వేదములలోనే వున్నది.      
               వేదములను వివిధ ప్రాంతముల వారు 
               వివిధముగా నుచ్చరింతురు. 
               అందుకే భిన్నాభిన్నముగా 
               ప్రాతిశాఖ్యలు పుట్టినవి.

పుట్టపర్తి : యేమో ..
               ఈ విషయము నా తలకు మించినది. 
               వైదిక విద్యలో నాకంత ప్రవేశము లేదు. 
               నాది మిడి మిడి జ్ఞానము. 
               ఏ విషయము నైన 
              నిర్ధారించి చెప్పగల మహాపురుషులు మీరు..

శ్రీవారు : నీ పరిశ్రమకు సంతోషపడినాము. 
             నీ యాధ్యాత్మిక దృష్టి గూర్చి..
             చాలా చోటుల విన్నాము..!!
             మేము భావించి..
             సత్యము తెలుసుకున్నాము..!
             నీ పై మా సంపూర్ణ అనుగ్రహమున్నది..
 
మరియు అనేక విషయములపై..
శ్రీవారికి పుట్టపర్తి వారికీ సంభాషణ జరిగినది. 
సామాజిక ..
నీతి ..
సామ్య వాదము కూడ..
చర్చలలో వచ్చినది. 

కామకోటి పీఠాధిపతులు 
పుట్టపర్తి వారిని మనసారా దీవించారు. 

అనంతరం 
పుట్టపర్తి వారికి సన్మానం జరిగింది. 
స్వామివారిచే 
పట్టు పీతాంబరము బహూకరింపబడింది.
శ్రీవారు 
నటరాజు నలంకరించుచుండిన శేష వస్త్రమది. 
ఆ శేషవస్త్రమొసగుట 
పెద్ద యనుగ్రహముగ 
విజ్ఞులు భావించుచున్నారు.
 
12.1.1967 ఆంధ్ర ప్రభ దినపత్రిక