28 ఆగ, 2012

సరస్వతీపుత్రునికి నా ఆశీస్సు - శ్రీ ఆచంట జానకిరాం




“జీవితం ఒక రన్నింగ్‌ రేస్‌. 
అందరికీ మొదటి, రెండు, స్థానాలు రావు కదా. 
 అందుచేత ఫలమెలా పరిణమించినా 
మనం పట్టించుకోకూడదు. 
ఏది చేసినా బాగా మనస్సు పెట్టి చెయ్యాలి. 
మనిషికీ మనిషికీ మరి కాస్త అన్యోన్యత ఉండాలి…’


ఔను కదూ..
పరిగెట్టిన వాళ్ళందరినీ మొదటి బహుమతి వరించదుకదా..
అలా పరుగెడుతూనే ఉండాలి..
మన స్పూర్తి చూసి గెలిచిన వాళ్ళూ 
ఓడిన వాళ్ళూ ఉత్తేజితులవ్వాలి..

ఆచంట జానకి రాం గారి  గురించి వెతుకుతుంటే 
వారి ఫోటో దొరకలేదు.
"నా స్మృతిపధంలో.." అంటూ 
వారి జీవితంలో తారసిల్లిన 
గొప్ప వ్యక్తుల గూర్చి వ్రాసిన 
ఒక విధంగా ఆత్మావలోకనపు వివరణ  కళ్ళబడింది.


"జీవిత చరిత్ర "
అంటే జరిగిన ప్రతి సంఘటనా 
అందించాలని తాపత్రయ పడటం కాదు..
ప్రతి జీవితంలో 
ఎంతో కొంత చెత్త ఉండనే ఉంటుంది.
అవి తెలుసుకొని యేం ప్రయోజనం..
నలుగురికీ ఉపయోగకరమైనవి 
స్ఫూర్తి దాయకమైనవి కొన్నైనా చాలు
"గంగిగోవుపాలు.."
 
కొందరు తమ చరిత్రలలో ఆనాటి సామాజిక పరిస్తితులకు పెద్ద పీటవేస్తే
ఇంకొందరు మహోన్నత వ్యక్తుల 

వ్యక్తిత్వాలను మనకందిస్తారు..
 
వీరేశలింగం.. గురజాడ.. ఉన్నవ.. 
వంటి మహా  వ్యక్తుల పరిచయ  పరిమళాల 
నా స్వాదించిన  జానకిరాం గారు
 

నా స్మృతిపధంలో ..
అంటూ చెప్పడం మొదలెడితే  
చెవి కోసుకోని వారిది దౌర్భాగ్యమే.


  

మి స్టర్ గూగుల్ ఏమన్నాడంటే...

"నా స్మృతి పథంలో ..
 జానకిరాం స్వీయచరిత్ర మాత్రమే కాదు. 
కళాహృదయం ఉన్న ప్రతిమనిషి కధ అనిచెప్పవచ్చు 

సాగుతున్న జీవితయాత్రలో ఏదో సన్నివేశంలో 
మనలని మనం చూచుకొ గలుగుతాం. 

జానకిరాం 
ఆయన తిరిగిన ప్రదేశాల గురించి కాని 
అయనకు పరిచయమైన వ్యక్తులు గురించి కాని 
ఎంత విపులంగా రాశాడు. 

మనం ఆప్రదేశాలలో, 
ఆవ్యక్తులతో కలసి లీనమైన 
అనుభూతి కలుగుతుంది 

ఆయన జీవిత గమనంలో 
ఎన్నో మజిలీ లు
ఎక్కడో  ఒక చోట గాని 
ఏదో ఒక మజిలీలొ గాని 
మనం కూడా కలుస్తాం 

మరో రకంగా ఈ పుస్తకం 
ఒక గైడ్ లాంటిది 
అని చెప్పవచ్చు

ఎంతో మంది పండితులు , కవులు ,
కళాకారులు ,గాయకులు 
ఆయన జీవితం గమనం లొ కలసి ప్రయాణిస్తారు 

వారి అనుభవాలు అన్ని 
మనకు అనుభుతులు గా మిగిలి పొతాయి.."


"మీ అనుభవాన్ని ఎంతోభద్రంగా ఇన్నేళ్ళు 
ఆప్టర్ ఈవెంట్స్ వల్ల ఇన్ ప్లూయెన్సూ కాకుండా ఇసొలేట్ చేసి స్టెరిలైజ్ చేసి, దాచిఉంచి ,
ఈనాడు ప్రొడ్యూస్ చేయటం 
ఇన్నేళ్ళ తరువాత , 
ఇప్పటి జానకీరాం కాక, 
ఆనాటి జానకిరాం, 
ఆనాడే వీటిని రాసి పెట్టుకున్నాడా అనిపించింది . 
ఆ ఒక్క గుణం చాలు, 
అట్లాంటి రాతల్ని ప్యూర్ అర్ట్ గా మార్చటానికి.."

అని చలం గారు అన్నారట..  


జానకిరాం గారు పుట్టపర్తి వారిని కలవాలని 

ఎంతో ప్రయత్నించారు.
"నేను రెండు మూడు పర్యాయములు 
ఆయనను వెతుక్కుంటూ కడప వెళ్ళాను 
ప్రత్యేకించి ఆ పని మీదనే వెళ్ళాను. 

కాని అచ్చటి నా స్నేహితులు నాతో అన్నారు 
"ఇప్పుడు మీకు ఆయన దొరకరు ..
సాయంత్రం లైబ్రరీకి వస్తే..
మీ అదృష్టం బాగుంటే..
అప్పుడు వారిని కలుసుకోవచ్చు .."


సాహితీ విస్మే రం "లోని దీ  వ్యాసం 

               "సరస్వతీపుత్రునికి నా ఆశీస్సు.."

శ్రీ ఆచంట జానకిరాం 

శ్రీ నారాయణాచార్యుల వారికంటే 
నేను వయస్సున కొంచెము పెద్దవాడను కనుక 
వారి ఈ షష్టిపూర్తి సందర్భములో
 'వేయేండ్లు వర్థిల్లూ '
అని నేను ఆశీర్వదింపవచ్చును 

వేయేండ్లు అని ఎందుకంటున్నానంటే 
"సరస్వతీపుత్రుడు.."
 అనే సార్థక నామమును పొందినవారు 
ఇంతవరకూ చేసిన బాషాసేవ కంటే 
ఇంకా ఇంకా ఎంతో చేయవలసి ఉన్నది. 
మనలను ఆవరించి ఉన్న 
గాఢ తిమిరమును పారద్రోలి 
క్రొత్త వెలుగును ప్రసాదింపగల శక్తి 
కవిగా రచయితగా విమర్శకునిగా 
ఆయనయందు నిండుకొని ఉన్నవి. 
ఇవి స్వానుభవముతో చెప్పే మాటలు..

నేను రెండు మూడు పర్యాయములు 
ఆయనను వెతుక్కుంటూ కడప వెళ్ళాను 
ప్రత్యేకించి ఆ పని మీదనే వెళ్ళాను. 

కాని అచ్చటి నా స్నేహితులు నాతో అన్నారు 
"ఇప్పుడు మీకు ఆయన దొరకరు ..
సాయంత్రం లైబ్రరీకి వస్తే..
మీ అదృష్టం బాగుంటే..
అప్పుడు వారిని కలుసుకోవచ్చు ..

కాని మీతో ఒక సంగతి చెప్పాలి ..
ఆయన మితభాషి ..
మీతో ఎక్కువసేపు మాట్లాడక పోవచ్చును ..
మీరు నిరుత్సాహ పడవద్దు.." అన్నారు 

అప్పటి నాదృష్టం బాగోలేక 
నేను కడపలో ఉన్న మూడు రోజులూ 
ఆయన లైబ్రరీకి రాలేదు. 

ఏదో ఊరు 
భీమవరం కాబోలు సన్మానానికి వెళ్ళారట. 
ఆ సంగతి నా స్నేహితులకి తెలియదు. 

కాని కొన్ని ఏండ్ల తరువాత 
నేను భీమవరము వెళ్ళీనప్పుడు 
ఆ ఊరిలో ఉన్న నా స్నేహితులు 
అచ్చటి వారి కార్యక్రమ విశేషములు గురించి 
వివరముగా చెప్పి 
ఆయన వసుచరిత్రా విమర్శన పుస్తకం 
ఒక ప్రతి నాకు ఇచ్చారు. 
ఆ పుస్తకాన్ని ఇంకా పదిలంగా దాచుకున్నాను.

ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం తిరుపతిలో 
వసు చరిత్రను గురించి మాట్లాడుతూ 
ఏదో ఒక చోట త్రోవతప్పి 
మరేవో విషయాలను గురించి 
చెప్పడం మొదలు పెట్టారు. 

సభలో ఉన్నవారికి తెలుసు 
ఆయన అసలు విషయాన్ని గురించి 
మాట్లాడటము లేదని. 

కాని ఎన్నెన్ని క్రొత్త విషయాలు చెప్పారు. 
అందరూ ఎంతో శ్రధ్ధతో విన్నారు. 
తరువాత ఒక అరగంట అయాక 
అసలు విషయానికి వచ్చి 
ఇంకో అరగంటసేపు ఆ ప్రబంధములోని 
అందచందాలను వివరించారు. 

ఆనాటి వారి ఉపన్యాసం  
ఇప్పటికీ జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాను నేను
శ్రీ నారాయణాచార్యులు చూడటానికి 
మనతో అంత చనువుగా ఉండరేమో అనిపిస్తుంది 
కాని పరిచయమయ్యాక 
చాలా చక్కగా ఎన్నో విషయాలను గురించి 
ఎంతో  ఆసక్తితో మాట్లాడుతారు. 
ఇతరులలా గాక 
మనము చెప్పేది శ్రధ్ధగా వింటారు. 


వారికి ఎల్లా కలిగిందో ఆ భావ ము 
'నేను చాలా సుకుమారుడ ననీ ..
సౌందర్యోపాసకుడననీ..' 
ఒక సభలో నన్ను గురించి 
సభవారికి పరిచయం చేస్తూ ఆయన అన్నారు. 

"ఈయనకు గులాబీపువ్వులంటే చా లా ఇష్టము...
కాని గులాబీ పొద చుట్టు ప్రదక్షిణము చేసి. .
పూవులతో విలసిల్లుతున్న ఒక కొమ్మను 
అతి సుతారంగా తనవేపు వంచి ..
ఒకే ఒక పువ్వును కోస్తారు. 
అలా కోస్తూ అంటారు..
"నీకు నొప్పి కలిగిస్తున్నాను.. క్షమించు..!" అని 
ఇంతకూ ఆ పువ్వు తనకోసం కాదు..
 నా వంటి వానికి కానుకగా ఇయ్యడానికి.

ఆయన సంభాషణలో 
మంచి చమత్కారం ఉంటుంది. 
ఒకానొక కవి సమ్మేళనములో 
ఆహ్వాన సంఘాధ్యక్షుడు 
తన పాండిత్య ప్రకర్షణ కోసం కాబోలు 
"కవి వృషభులు అందరూ వేదిక నలంకరించి ఉన్నారు.." అన్నారు

 శ్రీ నారాయణా చార్యులు ప్రసంగిస్తూ 
తొలి పలుకుగా ఒక చురక వేసారు. 
"అధ్యక్షులు మమ్మల్ని అందరినీ 
ఆబోతులు క్రింద జమ కట్టారు 
ఆ గౌరవము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము." అని

కొన్నేండ్ల క్రితము 
ఎన్నో ఏండ్ల క్రితము 
బొంబాయి నుంచీ వెలువడే ఇలస్ట్రేట్డ్ వీక్లీ లో 
"నేటి తెలుగు సాహిత్యము"ను గురించి 
నేను ఒక పెద్ద వ్యాసము వ్రాసాను 

అందులో 
శివతాండవ కావ్యమును గురించి కొన్ని పేరాలు రాస్తూ కొన్ని ఘట్టాలను వివరించాను 

కొన్ని భాగములను 
నా నేర్చిన మేర ఇంగ్లేషులోకి అనువదించాను కూడా. శివతాండవము చదువుతూ 
మరీ బాగున్నవి అనుకున్న పంక్తుల ప్రక్కన
 ఎర్ర పెన్సిల్ తో గుర్తు పెట్టే వాడను. 

గ్రంధము పూర్తిగా చదివాక..
ఎర్ర పెన్సిల్ గుర్తుల పంక్తులే ..
ఎక్కువగా కనుపించాయి.

శివతాండవము 
ఆచంద్రతారార్కము 
సాహితీ ప్రపంచమున వెలుగు ధ్రువతార 

ఇది కవనము కాదు ఒక ఆవేశము
(ఆవేశానికి ఇంగ్లేషులో ఇన్స్పిరేషన్) 
అంటారు అనుకుంటాను. 

తాండవాన్ని ప్రత్యక్షము చేసుకొని 
సొంపైన మాటలతో 
ఇంపైన వర్ణనలతో 
మనకు వర్ణనాతీతమైన ఆనందాన్ని కలుగ జేస్తారు 

నేను అనేక సార్లు అనుకుంటూ ఉంటాను 
వీరు ప్రదోషకాలమున 
శివతాండవాన్ని కళ్ళారా చూచి ఉంటారు అని 
ఇక మాటల ఎన్నిక 
వర్ణనల కూర్పు 
మనలను పులకాంకితులను జేస్తవి.

ఈ కాలపు ఎం ఏ తరగతి విద్యార్థులను సైతము "శివతాండవము చదివారా ../"
అని ప్రశ్నిస్తే ..వారిచ్చే సమాధానము 
"చదువ ప్రయత్నించాను.. 
కాని ఏమీ అర్థం కాలేదండీ.." అంటారు. 

అటువంటప్పుడు నాకు పట్టరాని కోపమూ 
నేటి మన తెలుగు జాతి ఎడల జాలీ కలుగుతుంది. వీరికంటే జంతువులే నయమనిపిస్తుంది కూడా.


"అల మృగములు గ
న్నుల భాష్పమ్ములు
విడిచెడు నెందుకు..?
విశ్వేశ్వరునకు
నడుగులు గడుగుట
కై పాద్యంబో..?

గుస గుసమని యీ
కిసలయములు స
మ్మదపూరముగా
మాటలాడునేదో..?
యేమున్నది.. లోకేశ్వరు
నాట్యమే...!!"

ఓహో హో హో
యూహాతీతం
బీయానందం
బిలాతలంబున.."

చెరుకు పానకంలా తీయనైన ఈ మాటలు 
ఎందుకు అర్థం కావు.. హృదయమున్న వారికి..?
ఈ కావ్యమంతా 
ఏరి కూర్చిన  చక్కని పదాలతో 
మధురమైన భావాలతో 

ఆశ్చర్యపరచే ఊహతో నిండి ఉంటుంది. 


నేననుకుంటాను..
కవి ఈ కావ్యాన్నంతా 
ఒక్క రాత్రిలోనే కలగన్నారని ..

ఈ మాటల ధోరణి చూడండి..

"తలపైని చదలేటి యలలు తాండవమాడ...
నలల త్రోపుల గ్రొన్నెరపూవు గదలాడ..."

ఎంత చక్కటి రూపకల్పన..
మరొకచోట ఈ మాటలు..

"పలపలని వెన్నెలలు జిలికించెడు విధాన ..
మనసులో సంతసము జారెడు విధాన.."

ఇంకొక ఘట్టములో..

"తరగలను చిరుగాలి పొరలు వేచినయట్లు..
చిరుగాలిలో దమ్మి ..విరులు గదలినయట్లు..
విరులలో నునుదావి.. తెరలు వేచినయట్లు..
తెరలపై చిత్రాలు ..పరిఢవించినయట్లు.."

అలా సాగిపోయే కవితా ధార..
మనలను మునుపెరుగని  
దూ రతీరాలకు తీసుకుపోతుంది. 

అక్కడ అద్భుతరసముతో 
మిళితమైన శాంతి లభిస్తుంది.

ఇవి  మాటలు కాదు ..
రసగుళికలు చూడండి..

"ప్రతి తారకయు విచ్చి.. ప్రత్యణువు బులకించి..
శితికంఠునకు నపుడు సెల్లించినది సేవ..
యానంద సాగరం బంతటను గలసికొన..
మీనములు దిమిఘటను మేదినీ జీవములు
బ్రతిప్రాణి హృదయమ్ము వల్లకీ వల్లరిగ
మతిమఱచి పాడినది మధుర సంగీతమ్ము..
జగమెల్ల భావంబె ..సడియెల్ల రాగంబె..
జగతియే యొక నాట్య సమ్రంభమునుగాగ..

నాడెనమ్మా శివుడు..!!
పాడెనమ్మా భవుడు..!!

ఇంకా కొన్ని వర్ణనలు ఎప్పటికీ మరపురానివి

"కనుదోయి సైగలకు.. గనుబొమలె బదులొసగ..
మనసులో నూహలకు.. దనువె బులకలు దాల్ప..

                                    ***
"ఇలయెల్ల చెలువు రూపెత్తి నిల్చినయ ట్లు
గలలెల్ల నిజములై గానుపించినయట్టు..
                          ***
తానె తాండవమౌనొ ..తాండవమె తానౌనొ..


కొన్నేళ్ళక్రితం నేను చిదంబరం వెళ్ళాను 
ఆలయపు ముఖ ద్వారపు తలుపులపైన 
పరమ శివుని నాట్య భంగిమలు
శాస్త్ర రీత్యా చెక్కబడివున్నాయి 

ఈ విషయాల గురించి బాగుగా తెలిసిన ఒకరు 
మాకు ప్రతి అంగుళౌ మేర విశదపరిచారు. 
ఎంతో నేత్రానందకరంగా ఉన్నవి.
కాని వానిలో దేనిలోనూ లేని చైతన్యం 
మన సరస్వతీపుత్రుని మాటలలో కనుపిస్తుంది నాకు.
 
మద్రాస్ కు సమీపాన 
తిరువెలంగాడు అనే ఊరు ఉన్నది 
"కాడు" అంటే ఊరిపేరుగా వాడతారు వారు.
" కాడు" అంటే మరుభూమి అని కూడా వారికి తెలుసు 

ఆ ఊరిలో వున్న 
ఒక ముసలి బ్రాహ్మడు నాతో చెప్పాడు 
ఒకసారి ఇల్లా 
" ఈ కాలం వాళ్ళు నమ్మరు కాని..
 అమినోల అనబడే పెద్ద బయలు మీదనే..
 శివుడు నాట్యమాడాడు..
 అందుకే ఈ పేరు వచ్చినది ఈ ఊరికి ..!"అని
 
నేను అనుకుంటూ ఉంటాను..
మన నారాయణాచార్యులు 
ఏ జన్మలోనో తిరువెలంగాడులో 
ఆ శివతాండవమును కనులారా తిలకించారు అని అటువంటి అనుభవమును పొందినవారికి 
ఇక మాటల కేమి కొదువ..?
 
నేను సాధారణంగా పురాణ శ్రవణం చేయను 
అంతసేపు కూర్చోలేనేమోనని భ్రమ. 

కాని ఇటీవల నేను కడప వెళ్ళినప్పుడు 
శ్రీ నారాయణాచార్యులు ఒక రాత్రి తొమ్మిది గంటలకు 
ఒక సమావేశమున చేస్తూన్న 
పురాణ పఠనమును వినడానికి వెళ్ళాను 

ఒకవైపు 
బారులు బారులుగా కూర్చున్న స్త్రీలతోనూ 
ఒకవైపు పురుషులతోనూ 
కిటకిటలాడుతోంది ఆ సభ 

నేను ఆ సభకు వెళ్ళగానే నన్ను గుర్తించి 
కొంచెం ఆశ్చర్య పడ్డారనుకొంటాను సరస్వతీపుత్రులు తరువాత "మీరూ వచ్చారే.."
 అంటూ నన్ను ఎంతో ఆదరించి 
తమ సన్నిధిని కూర్చోనియమించారు. 

ఆనాటి నా అనుభవము 
ఎప్పటికీ మరువరానిది. 
అప్పుడు వారు ..
శ్రీమద్రామాయణమును పఠిస్తున్నారనుకుంటాను. 

మూడే మూడు పద్యాలు సందర్భానుసారంగా మూలమునుండీ శ్లోకాలను వినిపిస్తూ చెప్పారు 
మధ్య మధ్య ఎన్నో వ్యాఖ్యానాలు
 ప్రజల నిత్య జీవితమునకు సంబంధించిన 
ఎన్నో విషయాలు గంటన్నర సేపు చెప్పారు. 

ఇదివరకు నేను ఏసభలోనూ 
అంతసేపు కదలక మెదలక కూర్చోలేదు.

శ్రీవారు ప్రచురించిన గ్రంధాలుగాక 
ప్రచురణకు సిధ్ధమైన గ్రంధాలు కూడా వున్నాయి 
వానిని కూడా ప్రచురించవలసిన బాధ్యత 
అందరిపైనా వున్నది 

ప్రత్యేకంగా 
ఇటువంటి సత్కార్యములు నిర్వహించడానికే
 ప్రభుత్వ ఆదరణను పొందుతూ వున్న 
కొన్ని సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లో 

అచిరకాలంలో 
ఆగ్రంధములన్నీ అచ్చై 
పాఠకుల చేతులనలంకరిస్తాయని 
నా ఆశ.. విశ్వాసమూను...
 
 సుమారు పదేండ్లక్రితము 
శ్రీ నారాయణాచార్యులవారు నాకు 
తమ శివతాండవము ప్రతిని ప్రసాదించారు. ఆసందర్భములో ..
పుస్తకం మొదటిపేజీ మీద వ్రాసిన మాటలు 
ఇప్పుడు మరల వారికందిస్తున్నాను. 
ఎన్నో రెట్లు ఇనుమడించిన భక్తితో..
 
"స్నేహశీలి అమృతహృదయుడు ప్రణయోపహారము
 
శ్రీ సరస్వతీపుత్రులు సంకల్పించిన 
ప్రతి సంకల్పమూ దిగ్విజమంగా నెరవేరాలి. 
వారి కీర్తి శత సహస్ర విధాల వర్ధిల్లాలి. 

                                  శుభం..
                          ఆచంట జానకిరాం