17 సెప్టెం, 2012

డా . పుట్టపర్తి వారితో ఒకరోజు




కడప  రేడియోలో నేను
మహిళాభారతి చేసేదాన్ని 
వారంలో రెండురోజులు
ఇంకా మీ ఉత్తరాలూ 

పిల్లల కార్యక్రమాలూ చేసాను.
అప్పట్లో
శాంతలక్ష్మి గారితో పరిచయం
రికార్డింగ్ కొచ్చారామె
అప్పటికి మా ఇల్లు 

అమ్మలేక బోసిపోయి వుంది.
మా హృదయాలు చిన్నబోయి వున్నాయి
అదొక పరీక్షాకాలం..

                        

                        డా . పుట్టపర్తి వారితో ఒకరోజు
                           శ్రీమతి కె.ఎన్.శాంతలక్ష్మి

సరస్వతీపుత్ర బిరుదాంకితులు 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారి పేరు 
నేను తొమ్మిదోక్లాసు 
చదువుతూవుండగానే విన్నాను. 

ఆయన వ్రాసిన ప్రబంధ నాయికలు 
అన్న పుస్తకం నుండి 
సత్యాదేవి అనే పాఠ్యాంశాన్ని 
మాకు స్పెషల్ తెలుగులో పాఠంగా ఎన్నిక చేసారు 

అందులో 
ఆయన సత్యభామ పాత్రపోషణ 
ఈనాటికీ నాకు కళ్ళకు కట్టినట్టుగా వుంది. 

ముఖ్యంగా 
ఆయన భాష ఎంతో శక్తివంతంగా 
రాయలసీమ మాండలికాలతో 
హృదయానికి హత్తుకొనేదిగా వుండి 
సాక్షాత్ సత్యభామాదేవి 
మన కనుల ముందు వున్నదా ..?
అన్న భ్రమను కలిగిస్తుంటే 

పాశ్చాత్య కవులు 
picturesque description అంటారే 
అలాంటిదన్నమాట 
ఆచార్యులవారి వర్ణనా చమత్కృతి 

నా చదువై.. 
శ్రీ సత్యసాయి డి గ్రీ కళాశాలలో 
లెక్చరరుగా చేరిన 5,6 సంవత్సరాలకు 
తెలుగు డిపార్ట్ మెం ట్ వారు 
శ్రీమాన్ నారాయణాచార్యులవారిని పిలిపించి 
కళాశాల లైబ్రరీలో 
ఆయన ప్రసంగాన్ని ఏర్పాటు చేసినప్పుడు 
ఆయనను చూసే భాగ్యం కలిగింది. 

ఆయన రచించిన శివతాండవం 
స్వయంగా గానం చేసి 
శివతాండవాన్ని మాకందరికీ దర్శింపచేశారంటే అతిశయోక్తి కాదు. 
ఆయనకు కేంద్ర ప్రభుత్వం 
పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంలో 
ఆయన జీవితంపై 
TV లో డాక్యుమెంటరీ చూపించినప్పుడు 
ఆయన నిరాడంబర జీవన విధానం గురించి 
ఒక అవగాహన ఏర్పడడమే కాకుండా 
ఆయన నుండి తెలుసుకోవాల్సింది 
ఎంతో వుందనిపిస్తుంది.

నేను రేడియో ప్రసంగాలకి 
కడప రేడియో కేంద్రం 
వెళ్ళాల్సి వచ్చిన సందర్భంలో 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 
ఆఖరు కుమార్తెను 
రేడియో స్టేషనులో చూడడము జరిగింది. 

ఆచార్యులవారు 
మా మామగారైన 
ధన్నవాడ (కిడాంబి) శ్రీనివాస రాఘవాచార్యుల వారికి చాలా సన్నిహితులు 
ఆచార్యులవారి సతీమణి 
శ్రీమతి కనకమ్మగారు 
ధన్నవాడ వాళ్ళ ఇంటి ఆడపడుచు కావడం 
ఈ సాన్నిహిత్యానికి కార ణం కావచ్చు 

కాని నాకు వారితో ముఖముఖి పరిచయం సంభాషణావకాశం 
ఒక రోజు మాత్రమే లభ్యమైంది 
రేడియో ప్రసంగాలకు వెళ్ళినప్పుడు 
వారి అమ్మాయితో పరిచయం కారణంగా 
ఆ అమ్మాయి ఒకనాడు 
నన్ను ఇంటికి ఆహ్వానించినా 
ఇతర కారణాలవలన 
ఆనాడు వెళ్ళలేక పోయాను 

కాని 
ఆరుమాసాల తరువాత 
మరొక రేడియో ప్రసంగానికి వెళ్ళినప్పుడు 
రికార్డింగ్ ఆలశ్యం కావడం 
అనంతపురానికి బస్సులు లేని కారణంగా 
శ్రీమాన్ ఆచార్యులవారిని 
దర్శించినట్లు వుంటుందని 
వారి ఇంటికి బయల్దేరాను 

"జగమెరిగిన బ్రాహ్మణికి జంధ్యమేల..?"
అని ఆయన ఇల్లు కనుక్కోవటం చాలా తేలికైంది 

కాని వాళ్ళ అమ్మాయి ఊళ్ళో లేదు 
పెళ్ళి చూపులకని సోదరునితో కలిసి 
హాస్పేటకు వెళ్ళిందని 
వారి కోడలి ద్వారా తెలిసింది 

నేనెవరో ఆచార్యులవారికి తెలియనందువలన 
మా మామగారి పేరు 
పుట్టపర్తి వారి ఇంటి ఆడపడుచైన 
మా అత్తగారు శ్రీమతి మహాలక్ష్మి పేరు చెప్పుకొని 
నా పరిచయాన్ని తెలుపుకొని 
ఆచార్యులవారికి నమస్కరించాను 

ఆయన ఎంతో ఆదరణతో 
నన్ను వారి కోడలికి పరిచయం చేసి 
స్వంత ఇంటిలాగ భావించి 
రాత్రికి విశ్రాంతి తీసుకోమని 
పితృవాత్సల్యాన్ని ప్రదర్శించారు 

వారితో మాట్లాడిన కొంతసేపటిలో 
కుమార్తె వివాహానికి సంబంధించిన ఆందోళనతో 
ఆయన బాగా క్రుంగివున్నట్లు కనిపించారు 

వార్ధక్యం ఒకవైపు 
ఆర్థిక అనానుకూలత మరొకవైపు 
ఆయనను బాగా కలచివేసినట్లు 
నేను పసికట్టాను

ఆచార్యుల వారు నాతో మాట్లాడుతూ 
నా భార్య బ్రతికున్న రోజులలో 
పిల్లల వివాహాలను గురించి 
నేను ఏనాడూ పట్టించుకోలేదు 

ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తే 
చివర విజిటర్ లాగా వచ్చి 
పీటల మీద కూచుని 
వివాహాలలో పాలు పంచుకునేవాడిని 

అటువంటిది 
ఈ చివరి అమ్మాయి పెళ్ళి విషయం 
నా మెడకు చుట్టి ఆమె వెళ్ళిపోయింది 
ఇది నాకు అలవాటు లేని విషయం 
ఎలా జరుగుతుందో..?
 అని ఆవేదన వ్యక్తం చేసేటప్పుడు 
ఆయన కళ్ళల్లో తడి 
గొంతులో ఆర్ద్రత కనిపించింది 

జనక మహారాజంతటివాడే 
శివధనుస్సును ఎక్కుపెట్టలేక 
సతమతమౌతున్న రాజాధిరాజులను చూసి 
జానకికి కళ్యాణయోగం వుందా..? లేదా..?
 అని ఒక్క క్షణం తపించినప్పుడు 
సామాన్య మానవుల మనఃస్తితి చెప్పేదేముంది 

కాని 
భగవంతుడాయన ఆవేదనను 
అర్థం చేసుకున్నాడా అన్న్నట్లు 
నేను వెళ్ళినప్పుడు ఏ సంబంధం ప్రయత్నించారో 
ఆ సంబంధమే కుదిరి 
ఆ అమ్మాయి వివాహమైనట్లు తెలిసి 
నాకు చాలా సంతోషం కలిగింది.

టి వి లో చూచిన విధంగానే 
ఆయన ఇల్లు జీవన విధానం 
ఎంతో నిరాడంబరంగా వుంది 
ఆయన పౌత్రుడితో ఆడుకునే కొంచంసేపు 
వారు పసిపిల్లవానిలా కనుపించారు 

ఎన్నో భాషలు నేర్చి 
ఎన్నో గ్రంధాలను రచించి 
మరెన్నో సన్మానాలు పొందినా 
ఆయనలో ఎక్కడా 
అహం కాని దర్పం కాని చోటుచేసుకోలేదు 

నాతో మాట్లాడినరోజు 
ఈ సన్మాన విషయాలను గురించి ప్రస్తావిస్తూ కలకత్తాలో ఒక సన్మానం వుందని 
దానికి తమ అనారోగ్య కారణాల వలన 
తాము రాలేమని తెలిపినా 
వారు ఆచార్యులవారికి 
వారితో పాటూ వచ్చేవారికి 
విమాన చార్జీలను ఇస్తామని 
వారిని తప్పక రావలసిందిగా 
ఆహ్వానించినట్లు చెప్పారు. 

కాని వార్ధక్యం తమను 
అంతదూరం ప్రయాణం చేయనివ్వడం 
అనుమానమే అని అన్నారు 

అనంతపురంలోకూడా సన్మానం వుందని 
దానికి వీలైతే రాగలనని అన్నారు 
వారు వచ్చి వెళ్ళింతరువాత తెలిసింది

అనంతపురం వీధుల్లో ఎన్నో సార్లు తిరిగినా 
శ్రీమాన్ నారాయణాచార్యుల వారి 
ప్రతిభను గుర్తించిన వారు చాలా తక్కువ 
కాని ప్రభుత్వం 
పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించగానే 
వారికి సన్మానం ఏర్పాటుచేసారు 

బహుశా భానుమతి రామకృష్ణగారు 
ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్లు 
ఆంధ్రులను ఆంధ్రేతరులే తొందరగా 
వారి ప్రతిభను గుర్తించి గౌరవిస్తారన్నది 
మరోసారి ఋజువైంది. 

శ్రీమాన్ ఆచార్యులవారు 
అనంతపురం సభలో మాట్లాడుతూ 
తమకి కావల్సింది 
సన్మానాలు పూలమాలలు ప్రశంసలూ కావనీ 
తాము రచించిన పుస్తకాలను ముద్రించి 
వెలుగులోనికి తీసుకురావటం 
వానిని చదవటం 
చదివింపజేయటం ద్వారా 
తమలోని కవికి నిజమైన సన్మానమని అన్నారట.
 
ఏది ఏమైనా 
అంతటి మేధావి సాహితీవేత్త ఇకలేరు
అంటే నిరుత్సాహం కలుగుతుంది
వారి శిష్యులు ప్రశిష్యులు 
ఆశ్రితులు అభిమానులు మొదలైనవారు ఆచార్యులవారి అముద్రితాలైన రచనలను 
క్రమక్రమంగా 
వెలుగులోనికి తీసుకురావటం ద్వారా 
వారికి నిజమైన శ్రధ్ధాంజలి ఘటించిన వారౌతారు.