7 ఏప్రి, 2014

తతికాలమేతెంచె..ఓం, న, మో, నా, రా, య, ణా, య'




ప్రాచ్య లిఖిత గ్రంధాలయం, హైదరాబాదు వారు 
వెలికి తెచ్చిన పుట్టపర్తి అష్టాక్షరీ కృతుల గ్రంధ  రూపమిది
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కొమండూరి గారి ముందుమాట 

మనం తప్పక చదవాలి
 

గత రెండు మూడు నెలలుగా వారు 
ఈ కార్యంపైనే దృష్టి యావత్తూ కేంద్రీకరించి వున్నారు..
అట్లానే వారు వ్రాసిన పీఠిక ప్రతి పదమూ సంగీత తంత్రులను మధురంగా మీటుతూ మనకానందాన్ని కలిగిస్తాయి
 

కొమండూరి వారు పుట్టపర్తి వారితో 
ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని కలిగివున్నారు
ఒంటిమిట్ట వాసుదేవుడైన కోదండ రామస్వామి భక్తుడు 

ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామియందు 
అతిశయ అనురాగముండినది పుట్టపర్తికి.
'పుట్టపర్తికి గల నిరతిశయ నిశ్చల భక్తి 
సస్యములు పండి పైరగునని '
వాసుదాస స్వామి జోశ్యము చెప్పినారట..
''ఒకనాడు నారాయణుడు నీకగుపించునయ్యా..''
అని జోశ్యము చెప్పిరి
అంటారు.
 వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు


భగవత్ చరిత్రలెన్నో వుండగా 
రామాయణ రచనకే ఎందుకు పూనుకున్నావని అడిగినవారికి 
తనదైన శైలిలో జవాబిచ్చారు వాసుదాసుగారు. 

ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, `
భార్యా వియోగం కలగడంతో, 
వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. 

జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, 
బిక్షాటనచేసి లభించిన ధనంతో 
ఆలయాన్ని అభివృద్ధి చేసారు.
జనన-మరణ రూపకమైన సంసార బంధం నుండి 
విముక్తి చేసేది రామ కథేనని, 
భగవత్ సాయుజ్యం పొందేందుకు 
రామాయణ రచన చేసానని అంటారాయన. 

పూర్వం కొందరు రాసారుకదా, 
మరల ఎందుకు రాస్తున్నావంటే, 
 "ఎవరి పుణ్యం వారిదే. 
ఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు" 
అని జవాబిస్తూ, 
శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామాయణాన్ని రచించి వాగ్రూపకైంకర్యం చేయదల్చానంటారు వాసుదాసుగారు.

ఎంతటి పుణ్య చరితులో కదా
ఒకే మార్గంలో పయనించే పథికులిద్దరూ..  

పుట్టపర్తీ వావికొలను..
ఈ ఆంధ్ర వాల్మీకి
ఒంటిమిట్టలోని ఒక గుట్టపై  ఒంటరిగా నివసిస్తూ వుండేవారు. మా అయ్య తరుచూ వారిని కలవటము. వారు మా ఇంటికి రావటమూ జరిగేది
 

మా అమ్మ మా ఇంటికి ఎవరు బంధువులు వచ్చినా రాండి అందరూ ఒంటిమిట్ట రాముని దర్శించుకుందాము అని
తనే ఖర్చు పెట్టి వారందరినీ తీసుకొని ఒంటిమిట్ట వెళ్ళేది.


అక్కడ వున్న కొలను అందులోని తామరలూ
అందులో తానాడటమూ నాగక్కయ్య అనుభవం.
 

ఇక కొమండూరు వారి వద్దకొద్దాం..
''కవి అష్టాక్షరీ విభుని అలంకరించిన ఆయుధాలను నుతించారు
కౌస్తుభము ఎద రహస్యమెరిగినదట..
పాంచజన్యము శంఖారావము చేత లోకమునకు విజయోత్సవ మిచ్చునదట..
నందకము సంసార మాయ ఖండితము..
హస్త చక్రము జ్వాల
పరమ పౌరుష కారమైన ఈ ఆయుధ శ్రేణిని 

కీర్తన ముఖంగా అభినుతి చేయుటయందు పుట్టపర్తి వారే ప్రధములట..
 

నందకాన్ని మలయమారుత రాగం లో
పీతాంబర ప్రస్థావన బిలహరి లోనూ
రక్షక చక్రమును మోహన లోనూ
ఇలా సాహిత్య గతుల అమరికకు అనుగుణంగా రాగ భావాలు అమర్చినారు
పుట్టపర్తి అన్వయించిన 82 నూతన రాగాలనూ వారు ఉటంకించారు.


చివరగా 
త్యాగరాజానంతర వాగ్గేయ సుధీమణులలో 
పుట్టపర్తి స్థానము 
ఈ రచనలను పరిశీలిస్తే అవగతమౌతుందంటూ
ఇట్టి మధుర రసాంచిత కీర్తనల వెలయించిన 

పుట్టపర్తి వాగ్గేయ చక్రవర్తి రచనలకు 
దేశాంతరమందున్న నాకు సంపాదకత్వ మొసంగినందుకు 
కృతజ్ఞత లంటారు..