29 డిసెం, 2015

శ్రీనివాస ప్రబంధం -2

శ్రీనివాస ప్రబంధం -2 
రచన సరస్వతీపుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు
దీన్ని నాకందించిన చి.E.N.V.రవికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ.



28 డిసెం, 2015

చలి .. లీలలు

వ్యాఖ్యను జోడించు

అమ్మ అయ్య మా మూడో బావ మురళీధర్ మా మూడో అక్కయ్య తులజ (ఈమె మా అయ్య సగం పుస్తకాలకుకుడి భుజం)  , కుర్చీల సందులో నేను,  మా సుబ్రహ్మణ్యం అన్నయ్య (అమ్మ శిష్యుడు+ కొడుకు) ,మా నాగ ,
పైకి పొతే పెద్దక్కయ్య, రెండో అక్కయ్య మధ్యలో మా అన్నయ్య అరవిందు, మా  పెద్ద బావ చిన్న బావ 
చలి పెరిగింది.. 
ఎక్కడ చూసినా దగ్గులూ జ్వరాలు
మేము నార్త్ లో వున్నప్పుడు 
జీరోల్లోకి పోయే చలికి చచ్చేదాన్ని
చలికి భయపడి హైదరాబాద్ కొస్తే 
 నా వెనకే వచ్చిందదీ..
కడపలో ఒకపొద్దన్నా స్వెట్టర్ వేసుకొని ఎరుగుదుమా..
హాయిగా చలికాలమైనా వానకాలమైనా ఎండకాలమైనా
మాకు ఒకటే వెదర్ ఎండలు.. వేడి
వెరీ ప్లెజంట్ కదా..
 I Love my cuddapah

మా అయ్యది ఉష్ణ శరీరం
 మా మిద్దిపైన బయలులో మంచమేసి 
పరుపు తెరా కడితే..
హాయిగా అడ్డపంచె అవతల పారేసి 
పసివాడిలా పండుకుంటారు..
అవతల ఇవతల మిద్దెల వాళ్ళు అలవాటు పడిపోయారు
'ఏమిటికి .. ఈ స్వామి ఇట్లా' అనే వాండ్లు లేరు
అయ్య ఉష్ణ శరీరానికి .. కడప ఎండలు ..
what a combination..

ఇక అయ్యకు జలుబు .. కాదు కాదు.. 
అయ్య మాటలో పడిశం పడితే .. 
అంతే సంగతులు.. 
వెంటనే మా అమ్మ మందుల సముదాయాలతో రెడీగా వుంటుంది
ఇంగ్లీషు ..ఆయుర్వేదం.. ఇంటివైద్యం..
(మా అత్తగారూ అంతే.. భలే ఓపికస్తురాలు
ఆరుగురినికన్నతల్లి మరి ఓపిక లేకుండా ఎలా వుంటుంది..
అసలు ఆడవాళ్ళకే అందరి భారాలను మోసే శక్తి ఎలా ఇచ్చాడో ఆ దేవుడు..)

పీల్చేవి.. నాకేవి.. లోపలికేసుకొనేవి పైన ధరించేవి..
ఓయమ్మ  .. 
మిరియాలు దంచి తమలపాకులో పెట్టి ఇచ్చేది
అయ్య బుగ్గన పెట్టుకుని రసం పీల్చేవారు
మిరియాల కాషాయం వుండ నే వుంది .. 

ఇంక ఆవిరి వైద్యం.. 
ఒక పెద్ద గిన్నె నిండా నీళ్ళు బాగా తెర్ల నివ్వాలి
ఇంకో పక్క ఇటుకలు ఎర్రగా కాల్చాలి
రెండూ రెడీ కాగానే అమ్మ అయ్యను 'రాండి' అని పిలుస్తుంది
అప్పుడు అయ్య వచ్చి భోజనాల గదిలో చాపపై కూర్చుంటారు
వేడినీళ్ళు తెచ్చి ముందు పెడుతుంది అమ్మ
రెండు మూడు దుప్పట్లు కలిపి అయ్య వీపు వెనక రెడీగా వుంచేది .. 
నేను చిన్నదాన్ని.. 
అయ్యను ఆసక్తిగా గమనించేదాన్ని 
నాలుగో తరగతి 
ఇంటర్ కొచ్చే సరికల్లా ఆ వైభోగం అంతా అయిపోయింది లెండి
అమ్మ పైకెళ్ళిపోయింది..

అప్పుడు వేడి వేడి ఇటుకఒకటి తెచ్చి 
వేడి నీళ్ళలో వేస్తుంది
నీళ్ళు 'సుయ్.. ' మంటూ పొంగుతాయి
అంతకుముందే నీళ్ళల్లో వేసిన అమృతాంజనం వాసన గుప్పుమంటుంది

వెంటనే అయ్య దుప్పటి కప్పుకొని ఆ ఆవిరిని రెండు నిమిషాలు పీలుస్తారు.
మళ్ళీ ఇంకో ఇటుక..
ఒక స్వెట్టరూ మంకీ క్యాపు ఎప్పుడూ తయారుగా వుండేవి
మంకీ క్యాపు లోని మా అయ్య ముఖం 
ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుం ది 
ఇట్లా అయ్యకు పడిశం తగ్గేసరికి 
అమ్మ ఉపిరి పీల్చుకుంటుంది 
అసలు ఇంట్లో ఆడవాళ్లు వున్నారనే కదా 
ఈ మగవాళ్ళ  ధైర్యం .. 
ఆ .. 

మీలో ఎవరు కోటీశ్వరుడు..


23 డిసెం, 2015

అరణ్య రోదన





పుట్టపర్తి విజ్ఞాన సంపన్నులు ..  
అనేక భాషలు నేర్చా రు .. 
అనేక పుస్తకాలూ వ్రాసారు  .. 
అంతేకాదు 
ఎంత రాసారో అంతకు వంద వంతులు చదివారు .. 
ఆకాలంలో కేవలం పుస్తకాలు కొనటా నికే 
మద్రాసు వెళ్లేవార ట .. 

బస్సులో పుస్తకం చదువుతూ చదువుతూ 
జేబులో డబ్బు ఏ దొంగ తీసినా తెలియనంత మమేకమై 
పోయేంత పుస్తక ప్రియులు .. 

మా అమ్మ ఒక బనియన్ కుట్టింది . 
ముందు జేబు వుండేలా .. 
దాన్ని దొంగల బనియను అనేవాళ్ళం .. 

NTR గార్డెన్స్ లో బుక్ ఫెయిర్  జరుగుతూంది. 
మా అయ్య పుస్తకాలు అక్కడ వెలిసాయి. 
చాలా మంది సందర్శిస్తున్నారు.
 భావాలు పంచుకుంటున్నారు. 

ఈ సందర్భంగా 
కడప జిల్లా రచయితల సంఘం సమావేశాల్లో అధ్యక్షోపన్యాసం ఇస్తూ.. పుట్టపర్తి ఇచ్చిన సందేశం. 

ఈనాడు హైదరాబాద్ లో 
బుక్ ఫెయిర్ జరుగుతున్న సందర్భంలో 
ఆనాటి వారి భావాలను పొందుపరుస్తున్నాను.

ఆశ్చర్యమేమంటే .. 
ఆనాటి వారి భావాలు ఈనాటికీ  వర్తిస్తుండటం..
అంతేకాదు.. 
ఈనాటికీ అవి అత్యంతావశ్యమకమై వుండటం

ఎందుకంటే పరిస్థితులు 
ఆనాటికంటె ఈనాడు సాంఘీకంగా రాజకీయంగా 
దిగజారి ఉన్నాయి కాబట్టి..

చదవండి..


''ఆంగ్లము నుండి మనము ఇంకను అనేక పుస్తకము లను భాషాంతీకరించుకోవలసి వున్నది. 
ఇప్పటికిని కాల్డ్ వెల్ రచనలు కుడా పూర్తిగా తెలుగులోకి రాలేదు. 
ఏ విజ్ఞానము కావలసియున్నను 
మనము ఇంగ్లీషులోనికి పోవలసినదే.. 
హిందీ యభివృధ్ధి కూడనంతంతయే యున్నది. 

మన దేశంలో అనేక భాషలున్నవి. 
మనకు దగ్గరగానున్న భాషలు ఒక్కదానినైనను నేర్చుకొనుటమంచిది. 
అప్పుడీ భాషా భేషజములెన్నియో తగ్గును. 

''నీవు చెప్పిన సలహాలన్నియు బాగుగనే యున్నవి. 
ఈ పనులు చేయుటకు ధనమెక్కడనుంచి వచ్చును ? ''

ప్రశ్న బాగుగనే ఉన్నది.. 
ఉత్తరము గూడ సులభమే.
 ప్రభుత్వమునకు తక్కిన పనులకు ధనమెక్కడినుంచి వచ్చునో ఇదియును అక్కడనుండియే రావలయును. ఉన్నధనమంతయు దీనికే దోచిపెట్టమని 
నేను చెప్పుటలేదు. 
పెట్టగూడదు గూడ. 

కాని ఇదియు కూడ చేయవలసిన పనియేయని ప్రభుత్వము యొక్క దివ్య చిత్తమునకు వచ్చిన చాలును. ఎలక్షన్లకు కోట్ల కొలది వెచ్చించి 
ప్రజలకు ఎన్ని దురభ్యాసములు నేర్పుచున్నారో మీరెరుగనిది కాదు. 

ఈ సందర్భములో రాజకీయవాదులకు 
ఒక చిన్న సలహా.. 
వారు విందురో విన రో.. నాకు తెలియదు.. 
కాని మనము చెప్పవలెను గదా.. 
వారు కొంత చదువుకొనిన బాగుగా నుండునని 
నా విన్నపము. 
కళాకారులను మనుష్యులుగా గుర్తింపవలెనని నా విన్నపము. కాలమున నిలుచునవి రాజకీయములు కావు. విజ్ఞానమే..! కళలే.. !


పూర్వమిట్లుండలేదు. 
ఆనాడు రాజులూ రౌతులూ 
తమకున్నంతలో కళలనెంతయో పోషించినారు. రెడ్డిరాజులు సాహిత్యాదులకు చేసినసేవ సామాన్యమైనది కాదు. 
ప్రభుత్వమే గాదు ప్రజలు గూడ 
విజ్ఞాన విషయమై తమ ధనమును 
కొంత ఖర్చు పెట్టవలసియున్నది. 

వెర్రి వేడుకలకు .. త్రాగుడు మొదలగు దురభ్యాసములకు లెక్కలేనంత ఖర్చు పెట్టెదరు. 
సాహిత్యజ్ఞునకు కళాకారునకు ఒక బొట్టునివ్వరు. 

పూర్వమెన్ని విద్యలనో ప్రజలు పోషించినారు. 
తోలు బొమ్మలవాండ్లు, పగటివేషగాండ్లు. 
బుడు బుడక్కలవాండ్లు, బయలు నాటకం వారు నట్టుకాండ్రు, వీరందరూ ప్రజాభిమానులపై బ్రతికినవారు. 

పొరుగున నున్న రష్యా.. 
ఏ చిన్న కళనైనను చావనివ్వక రక్షించుకొనుచున్నది. ఆయా కళలలో పరిశోధనా భాగములే యేర్పరచినారు. మనకా దృష్టిలేదు. 
ఇది నేను ప్రజలకు ప్రభుత్వమునకు కూడ ఇచ్చు సలహా మహాజనులారా .. 
ఇవి నాకున్న భావములు .. 
వానిని మీముందుంచినాను. 
ఆ భావములు మీకు సరిపోకపోవచ్చు. 

మీరు వివేకవంతులు 
ఆలోచించుకొనగలిగినవారు .. 
నాకు మీరే ప్రమాణము.. ''

19 డిసెం, 2015

ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ??

 

ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ?? 
 మరి మన ఋషులు వానప్రస్థం అంటూ 
ఏకాంతంలోకి వెళ్ళిపోయేవారు కదా..
మిగిలిన ఒంటరితనాన్ని 
ఆత్మ చింతనలో 
తనను తాను వెతుక్కోవటంలో గడిపేవారు. 
చూశారా మన హిందూత్వం గొప్పదనం.. 
ఇలాంటి ఒక క్షణం రాజు కైనా పేదకైనా 
తప్పక సంభవిస్తుంది. 

ఇలాంటి మార్గమే తెలియని పాశ్చాత్యులు 
అంతులేని భోగలాలసత లో మునిగి తేలి చివరికి ఆధ్యాత్మికత కోసం
 ప్రశాంతమైన ఆ స్థితి కోసం భారత దేశపు సాధువుల పాదాలపై వాలుతున్నారు.

ఏ ఒక్క బంధమూ శాశ్వతం కాదు.. 
జీవితంలోని ఒక స్థితి మాత్రమే.. 
అది దాటుకుని మహా మహా రాజులు సైతం 
తమ రాజ్యాన్ని వైభవాన్ని తృటిలో త్యజించి
 ఏ వసతులూలేని ఏకాంత వాసానికి తరలి వెళ్ళే వారు. 


ఋషులు .. దార్శనికులు..  
ఇందుకు తగ్గ మార్గ నిర్దేశనం ముందుగానే చేశారు. 
ఆ మార్గాన్ని అర్థం చేసుకొని అమలు పరచటమే 
మనం చేయవలసింది.

బ్రహ్మచర్యం.. గా ర్హస్థ్యం.. వానప్రస్థం.. సన్యాసం..
ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరుకోడానికి 
మేడమెట్లలా ఉపయోగించుకోవాలి..
నేనెవరు అన్న అలోచన విరాట్ స్వరూపం ధరించేది అప్పుడే..

ఏ కుటుంబ బంధమూ శాశ్వతం కాదు. 
వారి వారి సంసారాలు పెరిగినకొద్దీ
 మనకు ప్రాముఖ్యం తగ్గిపోతుంది.
దాన్ని పాజిటివ్ గా స్వీకరించి 
అడిగి నప్పుడు మాత్రమే సలహాలు ఇస్తూ 
సాగిపోవాలి .. 


సినీ నటుడు రంగనాధ్ ఆత్మహత్య చేసుకున్నారు 
ఉరి వేసుకుని
పిల్లల జీవితాలు ఎవరివి వారివయ్యాయి
భార్య వెళ్ళిపోయింది
సంపాదించిన డబ్బు ఆమె రోగం బారిన పడి కర్పూరమైపోయింది
మిగిలినవి గతం దాని తాలుకు జ్ఞాపకాలు

అయినా రంగనాధ్  ఎంతో గొప్పవాడు
అందమైన ఆడపిల్లలు ఎంతో సన్నిహితంగా మెలిగే వాతావరణంలో కూడా 
తనను తాను కోల్పోకుండా మిగిలాడు
ధనం తెచ్చే చెత్త అలవాట్ల వలలో జారి పడిపోకుండా తనను తాను రక్షించుకున్నాడు
మంచంలోపడిన తోడును 
అసహ్యించుకోకుండా .. వదిలేయకుండా.. 
ఎన్నో సంవత్సరాలు ఆమె బ్రతకటం కోసం తపించాడు

అయన ఆలోచనలు ఎంతో గట్టివి
అతను రాసిన కవిత చూడండి

ఎవరు దేవుడు
ఎవరు బండ
అదేదో ఊరినుంచీ మహాశక్తి వచ్చాడు
మరేదో ఊరినుండీపెద్ద బండ తెచ్చాడు
ఆరడుగులు కొలత బెట్టి బండను ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేశాడు
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది
మూడడుగుల బండ ముక్క చాకి రేవు చేరింది..
కంపు కంపు మనసులన్ని దేవుని ఎదుట నిలిచాయి
కంపు గొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి
గోతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి
మురికి మరకల బట్టలన్నీ నీళ్ళల్లో మునిగాయి
అర్థం గాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రధ్ధలు
చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు
శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది
పవిత్రతకై ప్రతిబట్టా బండను బాదుతోంది
కడకు, గుడినుండి మనసులన్నె కంపుతోనె వెళ్ళాయి
రేవునుండి బట్టలన్ని ఇంపుగా వెళ్ళాయి
గుడిలోని దేవుడా
రేవులోని బండా.. 
బండ దేవుడా కాదా అన్నది 


మన పరిపక్వతపై ఆధారపడివుంటుంది..


బండ లో దైవాన్ని చూస్తూ 
గురి నిలపడం కోసమే 
బండ దైవమయ్యింది
అక్కడితో మన ఆధ్యాత్మికత ఆగిపోలేదు..
ప్రతి ఒక్కరిలోను దైవాన్ని చూడమని చెప్పింది

భగవంతుడిచ్చిన జీవితాన్ని చివరివరకు 
సార్థకంగా జీవించమని చెప్పింది.. 
బండపై తమ మురికిని వదిలించుకోవడానికి 
బట్టలు తలలు బాదుకున్నట్టు
మనసులోని మురికిని వదిల గొట్టుకోడానికి
గుడిలోని బండ ఎదుట సాష్టాంగ పడటమే దాని అర్థం

రామకృష్ణుల వంటి వారు
రోజూ పొద్దుటే లేచి నా జీవితంలో ఒక రోజు వృధా అయిపోయింది

అమ్మ దర్శనం కాలేదు అని తలలు బాదుకుని ఏడ్చారు..

ఒకసారి ఏదో షూటింగ్ లో రంగనాధ్ గారిని చూశాను
మా ఊరివాడైన మల్లికార్జున్ పరిచయం చేశాడు..
ఆయనను నేనెంత ఆశ్చర్యంగా చూశానో
ఆయనా నన్నంత ఆశ్చర్యంగా చూశారు.. 

ఇంత మంచి మనసున్న రంగనాధ్ 
ఎవరో ఒక గురువును ఎంచుకుని ఆ మార్గంలో అడుగులేసి వుంటే బాగుండేదేమో..

11 డిసెం, 2015

తరం .. తరం .. నిరంతరం


ఇది శివతాండవం ..9వ తరగతి పాఠం 
పిల్లలకు అర్థమయ్యేలా వివరించిన దండె రామ్మూర్తి గారికి కృతజ్ఞతలు.. 

8 డిసెం, 2015

వాణిశ్రీ vs సురేకాంతం




ఒకసారి మా అయ్యతో 

సినిమా నిర్మాత ఎం.ఎస్. రెడ్డి 


కూతురు పెండ్లికి పోయాం మద్రాసులో .. 

నేను చిన్నదాన్ని పదో పన్నెండో వయసు.. 

వాణిశ్రీ అంటే బోల్డంత ఇష్టం.. 


దీనికి చదువుకంటే యే సినిమా యాక్టరు


 యెవరో అన్నీ అడ్రసుతో సహా చెబుతుందిరా.. 

అనేవారు మా అయ్య నవ్వుతూ.. నేను వాణిశ్రీ ని 


చూస్తానని మారాం చేశాను.. మా అయ్యకు ఇష్టం 


లేకపోయినా ఇంతలో వాణిశ్రీ వచ్చింది ఆమె చుట్టూ


 ఒకటే గుంపు.. ఆమెను కలవలేదు.. 

చివరికి సూర్యకాంతం ఎదురు వచ్చింది 

రెండుచేతులూ జోడిస్తూ

 నమస్తే పుట్టపర్తి నారాయణాచార్లు గారూ అంది నోరారా 


నవ్వుతూ..

నమస్కారమమ్మా .. ఇదిగో ఇది నా బిడ్డ అన్నారు 

అయ్య యేం మాట్లాడాలో తెలీక.
.
అంతే .. 


ఆమె నన్ను గుండెలకు గట్టిగా హత్తుకుని

 బాగున్నావా.. అంది.. ప్రేమగా.
.
తర్వాత మా అయ్య యెవరికి చెప్పారో యేమో ..


వాణిశ్రీ ఫోటోలు చాలా పోస్ట్ లో వచ్చాయి..


6 డిసెం, 2015

నవలాభిరామం

నవలాభిరామం 

28 నవం, 2015

హృదయమె సంకెల యౌ నా ..??


న గురోరధికం ..


న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః 
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః
గురువును మించిన తత్త్వం లేదుగురువును మించిన తపం లేదుగురువును మించిన జ్ఞానమూ లేదుఅట్టి గురుదేవులకు నమస్కారము.

శంకరాచార్యులవద్ద పద్మపాదాచార్యులనే శిష్యుడు
గురువు మాటే వేదవాక్కు
గురువే దైవం
తోటి శిష్యులకు అసూయ..

వారికి కనువిప్పు కలిగించాలని 
శంకరాచార్యులవారనుకున్నారు.

ఒకసారి సనందుని రమ్మని కబురంపారు
నదికటువైపునుంచీ..
ఇటువేపున ఉన్న శిష్యుడు పరుగు పరుగున వెళ్ళాడు.
నడుమ ఉరకలేస్తున్న నదిపైన
డాటడం ఎలా అన్న ప్రశ్న లేదు..
వేస్తున్న ప్రతి అడుగు కిందనుంచీ 
ఒక పద్మం వికసించింది..
ఆ పద్మాలపై నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇతర శిష్యులకు తమకు అతనికి ఉన్న భేదం చక్కగా 

గోచరమైంది..

ఇలా గురు చరితలు మనకనేకం . . 
మన మనసులో ముద్ర వేసిన వానిని మనం 
అప్పుడప్పుడూ వాడుతుంటాం .. 

ఒకసారి కేతు విశ్వనాధ రెడ్డి గారూ
శశిశ్రీ గారూ ఇద్దరూ ఒక దేవాలయం వెళ్ళారు..
అక్కడి పూజారి 
శశిశ్రీ ని గోత్రం చెప్పమని అడిగారట..
శశిశ్రీ తడుముకోకుండా భారద్వాజసగోత్రం అన్నాడట..
ఆశ్చర్యపోయిన కేతు గారు..
శశిశ్రీ నీవు ముస్లిం వి కదా 
మరి నీ గోత్రం భారద్వాజస అన్నావెందుకు 
అని అడిగారు
నేను పుట్టపర్తి నారాయణా చార్యుల శిష్యుడిని 
నా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులదే గోత్రమైతే 
నాదీ అదే గోత్రం 
అని చిరునవ్వుతో జవాబిచ్చారట శశిశ్రీ..
ఈ  విషయం 
కడప ఇన్ఫో లో త్రివిక్రమ్ గారు ప్రస్థావిం చారు
వాస్తవానికి పుట్టపర్తిది షటమర్షణ గోత్రం.
కానీ గురువు గోత్రమే తన గోత్రం అంటం చక్కగా వుంది
దానిద్వారా  గురువుతో ఎంత 
 మానసిక బంధం ఏర్పరుచుకున్నారో తెలుస్తుంది.
ఆ బంధం గురువే వేస్తాడో లేక 
 ఆయన తపోబలమే శిష్యుడిని కట్టిపడేస్తుందో.. 
శిష్యుడే తన భక్తితో గురువును పొందుతాడో..
అదంతా అలౌకిక ప్రపంచం 
కానీ గురువుగా ఒకరిపై గురి కుదరటం
 అందరికీ సాధ్యం కాదు 
దానికి కూడా ప్రాప్తం ఉండాలి 
దానిలో ప్రయాణం అతి దుర్గమం
బయలుదేరి వెళ్ళినవారు 
తమ అనుభవాలను మనతో పంచుకోరు..
కావాలంటే నీవూ వచ్చి చూడు అంటారు..
అంత అతిలోకమైన భావ ప్రాప్తి పొందిన తరువాత 

ప్రపంచం వేపుచూస్తారా..

20 నవం, 2015

కర్మఫలం




అయ్యా నీవు పూర్వజన్మలో ఎవరు
అని అడిగాను ఒకరోజు
అప్పటికి మా అమ్మ పోయింది .. 
అయ్యా  నిర్లిప్తతలో ఉన్నారు .. ఒక విధం గా .. 
నన్ను నిదానంగా చూశారు అయ్య
నా వంటి మూర్ఖురాలికి ..
అజ్ఞానికి ..
చెప్పాలనిపించిందో..  
అప్రయత్నంగా చెప్పారో .. మరి.. 

'అళియ రామరాయలు' అన్నారు 
ఆ జవాబుకు నా  రియాక్షన్ ఏమీ లేదు ..  
మా ఇంట్లో గత జన్మలు పునర్జన్మలు.. 
కర్మ లు బంధాలు .. 
ముక్తి మార్గాలు 
అన్నీ కామన్ వర్డ్స్ .. 
ఆ ప్రశ్న ఎంత బరువైందో .. 
జవాబు ఎంత విలువైనదో .. 
దాని అర్థమేమో నాకు తెలియదు అప్పుడు
అది నిజమా కాదా అన్న ఆలోచనా లేదు
అడిగాను ..చెప్పారు అంతే..

మల్లాది గారి జన్మ కర్మ చదువుతున్నాను.. 
అది నిజంగా ఒక కష్టమైన సబ్జెక్ట్ .. 

నిజమే కదా 
ఒక ఆవు పూజలందు కుంటుంది 
ఒక ఆవు చీత్కారాలకు గురి అవుతుంది 

ఒక పూవు నేలపై 
ఒక పూవు పూజకై 

ఏమిటీ వింత .. 
ఒకరికి మేడలూ .. ఒకరికి పేవ్ మెంట్లు . 

పాపాత్ముడు సుఖాలలో .. 
మంచివాడు  నిట్టూర్పులలో .. 

వారి వారి పూర్వజన్మ పాపకర్మ వల్లనే వారికా జీవితం 
అందరూ దీనికి త్వరగా కనెక్ట్ అవుతారు
పుట్టినప్పటినుంచీ మన మెండ్ సెట్ అలా తయారు చేసారు మనవాళ్ళు

దీనికి నాస్తికు దీన్ని అంగీకరించడానికి చస్తే ఒప్పుకోరు
అంతా మీ భ్రమ అంటారు
కనపడని శక్తిని..
అది తమమీద చేసే పెత్తనాన్ని ఒప్పుకోవటం
వారి మితిమీరిన అజ్ఞానానికి అహంకారానికి ప్రతీక.

నాస్తిక భౌతికవాదులు అంటే శాస్త్రవేత్తలు
వీరికి ప్రతిదానికి ఋజువులూ నిరూపణలూ కావాలి
అందరికీ ఒకే మెదడు పెట్టినా 
కొందరే మేధావులుగా తయారవుతున్నారన్న 
కొన్ని ప్రశ్నలకు వీరు జవాబేం చెబుతారో కానీ
వీరు నిరూపణలు కోరే కొద్దీ..
అందుకు సవాలు విసిరే మరో పది ప్రశ్నలు 
వెన్నడుతూనే వుంటాయి..
ఇవి అసుర లక్షణాలని గీత లో కృష్ణుని ఉవాచ

కర్మ సిద్ధాంతం ప్రకా రం .. 
గోడకి కొట్టిన బంతిలా మనం చేసిన కర్మ 
మనవేపు వేగంగా వస్తుంది
కర్మలు మనం చేసే ఫోన్ కాల్స్ వంటివి
భగవంతుని రికార్డు ల్లో ఎప్పటికప్పుడు 
అవి నమోదైపోతూనే వుంటాయి

తగిన సమయంలో 
తగిన శరీరం ఇచ్చి 
మనన్ని మన కర్మ ఫలాన్ని అనుభవించేలా చేసే వాడు  ఆ దైవం .. 
కర్మ ఫల ప్రదాత.

కర్మ ఫలాన్ని యోగులైనా అయోగు లైనా 
అనుభవింపక తప్పదు. 
ఇదే ఎన్నోసార్లు చెప్పేవారు పుట్టపర్తి 
ఈ కర్మ ప్రస్థానం  లో 
మా అయ్యా నేను ఏ మలుపులో కలుసుకున్నామో 

ఏ మలుపులో విడి పోయమో .. 
నాకు తెలియదు కాని 
ఈ కలయిక ఎప్పటికీ అద్భుతమే నాకు .. 

8 నవం, 2015

మునిమాణిక్యం గారితో ముచ్చట్లు..




                  పెళ్లిళ్లలో  మా అమ్మ అయ్యల  ఆశీర్వా దమే వారికి పదివేలు .. 

ఇరవయ్యవ శతాబ్దం మొదటిపాదంలో 
అంటే కథలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో మునిమాణిక్యం గారు 
హాస్య కథలతో ముందుకు కదిలారు

వారి రచనలలో 
కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు
దాంపత్యజీవితంలోని సౌందర్యమూ కనిపిస్తాయి

వారి కాంతం 
సాహిత్య వేదికపై అలంకరించిన స్థానాన్ని 
వేరుగా చెప్పవలసిన పనిలేదు..

వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ లో
 ఉపాధ్యాయునిగా పనిచేశారట..
ఆకాశవాణిలోనూ పనిచేశారట..
ఆయన నవల '
టీ కప్పులో తుఫాను'
వారి అమ్మాయే కాంతంగా వేసి మెప్పించారట
వారి రచనలు చదువుతున్నా..
అందులో ఇల్లు ఇల్లాలు ఒకటి

మునిమాణిక్యం గారికీ వాళ్ళావిడకూ రోజూ తగవేనట
విసిగిపోయారు ఆయన
కేవలం మా ఇంట్లోనే నా 
అందరీళ్ళలోనూఇంతేనా
వాళ్ళెలా నెట్టుకొస్తున్నారూ
అని సందేహం వారిని తగులుకుంది..
పైకి పొక్కటం లేదు ఎవ్వరూ చెప్పుకోవటం లేదు

సాహిత్య వీధిలో శోధన మొదలు పెట్టారు..
'మీకూ మీ భార్యకూ అభిప్రాయ భేదాలు రావా..
వస్తే ఎలా జరుపుకొని వస్తున్నారు' అని 
ఇంద్రగంటివారిని అడిగారట..
వారు మంచి పండితులు 
సాహితీపరులు మనస్తత్త్వ శాస్త్రం తెలిసిన వారు

ఆయన యేం సమాధానం చెప్పారో తెలుసా..
'నాకూ నా భార్యకూ అభిప్రాయ భేదాలు రాకుండావుండవు
ఆవిడ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం కలిగివున్నప్పుడే మేము
భిన్నాభిప్రాయము గలవారము అవుతాము
భిన్న తత్త్వాలకు గల అభిమతాలకు 
సంఘర్షణ యేర్పడి తగవుగా పరిణమిస్తుంది
కాబట్టి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు 
నా అభిప్రాయం చస్తే చెప్పను
ఇంక ఆవిడ యేం చేస్తుంది.. 
నోరు మూసుకుని ఊరుకుంటుంది
ఇదే నేను అవలంబిస్తున్న మార్గం 
పోట్లాటలు రాకుండా వుండటానికి..'

అభిప్రాయ భేదాలు వచ్చినపుడు 
నేనే నోరుమూసుకుని వుంటాను 
అని ఎంత చత్కారంగా చెప్పినారు 
అని సంబర పడ్డారట ముని మాణిక్యం గారు

సరే..కాటూరి గారిని అడిగి చూద్దాం అని
'ఏమండీ అన్నగారూ మీ ఇంటో పోట్టాటలు లేవా..?'
అంటే
'లేవు.. మేమెప్పుడూ పోట్టాడుకోలేదు..'
 అని ఫెడీ మని జవాబు చెప్పారట..

ముని మాణిక్యం గారు ఆశ్చర్య చకితులై .. 
'అదిఎలాగండీ ..
మీ ఆవిడ అంత వినయ సంపన్నురాలా..
సుగుణవతా..చెప్పినట్లు వింటుందా..?'
అని అడిగారు..

ఆయన ముఖం చిట్లించి విసుగుతో
'నేను చెప్పినట్లు ఆవిడ వింటుందని ఎవరన్నారయ్యా..
ఆవిడ చెప్పినట్లే నేను వింటాను..
ఏదైనా మాటా మాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే..
'దోషము గల్గె నావలన..
 దోసిలి యొగ్గితి నేలుకొమ్ము ..నీ దాసుడ..
 అని ముట్టెద తత్పదద్వయిన్'
అని చెప్పేసి గబ గబా వెళ్ళిపోయారట..

మునిమాణిక్యం గారు 
ఇంకా నయం మాఇంట్లో ఆ పరిస్తితి రాలేదు అనుకొన్నారు 
అనుకొని ఊరుకున్నారా..
దేవులపల్లి గారిని కదిపారు

'ఏమండీ మీ ఆలుమగల మధ్య పోట్లాట పొరుపూ వుంటాయా..'
అని అంతే..
'అమ్మో నా ప్రియురాలితో పోట్లాట..
 నేను భరించలేను..
ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది..
దుస్సహ గాఢ దుఃఖం నేను తట్టుకోలేను..
ఏడుపు వస్తుంది..
నా సంగతి నీకు ఆమాత్రం తెలియదేం..
మృదుల కరుణామధురము నా హృదయము
ఈ సంగతి ఎవ్వరికీ తెలియక పాయె..
ఎవ్వరెరుగ జాలరు ఏమని ఏడ్తునిప్పుడు.. '
అంటూ రుమాలు తో కళ్ళు వత్తుకుంటూ వెళ్ళిపోయారు..

అక్కడితో ఆగినా బాగుండేది .. 
వెళ్ళి వెళ్ళి వేదుల వారినడిగారు

ఆయనేమన్నారు..


'పోట్లాటలు లేకేమయ్యా..
నేనెంత బాధపడుతున్నానో నీకేమి తెలుస్తుంది..
నా బాధ ఎవరికీ చెప్పను
నాలోన నేనే మూల్గుకొందు 

కనికరము జూపు చిరునవ్వు తునకయే కరువయ్యె
నాకు పాడులోకాన'

అని గుట్టు విప్పారట..

 అదీ సంగతి అనుకొని

'మరి దేవులపల్లి వారు రోదనము చేస్తారట.
మీకు ఏడ్పు రాదా..'
అని ఏమైతే అదయిందని అడిగేశారు..

'రాకేమయ్యా చచ్చేట్లు వస్తుంది..
కానీ కనుల రానీనొక బాష్పకణమునైన..' 
అన్నారట దీర్ఘంతా నిట్టూరుస్తూ..

అందుకనే 'మహా సాగరాగాధ హృదయ బడబానల యెవ్వరికి తెలియు' అని గోలపెట్టాడు 

ఇక కవులతో లాభంలేదని
గురువుగారైన శివశంకర స్వామి వారిని అడిగారట..
'స్వామీ..
 భార్యా భర్తలమధ్య పోట్లాటలు లేకుండా వుండే మార్గం ఏది..'
అని
అందుకు వారు గొప్ప సూత్రాన్ని విడమరిచారు
'నాయనా..భార్యా భర్తలమధ్య పోట్లాటలు లేకుండా వుండటము అసంభవం.
ఇది అనాదిగా వస్తున్న సదాచారము.
అనుకూలవతి అంటే కొద్దిగా తేలికగా సరసంగా
ఏదో సంసారపక్షంగా కలహించేది అని ..
అంతే కాని
బొత్తిగా నోరు మూసుకొనికూర్చునేది కాదని అర్థం..
అదీ అసలు రహస్యం..
ఈ పరమ రహస్యాన్ని తెలుసుకొని
నీ జీవిత గమనాన్ని దిద్దుకో..
లేదా సన్యాసం పుచ్చుకో ఎవ్వరికీ చెప్పకుండా
అప్పుడు నీ భార్య చచ్చినట్టు వచ్చి
నీ కాళ్ళపై పడుతుంది..

చూశారా.. ప్రశాంత దాంపత్య జీవనానికి రహస్యం
ఒకటి భార్యా విధేయత లేదా సన్యాసం..
అని ఒక నిర్ణయానికొచ్చారు..

ఎంతైనా కవులు ఉన్మత్తులు..
వచన రచనకారులను అడిగి చూద్దం అని ఆలోచించిచూడగా
మొక్కపాటివారు
చిన్నతనంలో సంగతి జ్ఞాపకం లేదుగాని ..
ప్రస్తుతానికి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాయ్ రోజులు ..'

హాశ్చర్యపోవటం మునిమాణిక్యం గారి వంతు
ఏముంది ..
ఆవిడ రాజమండ్రిలో ..నేను మద్రాసులో
 ఎప్పుడైనా ఫోనులో మాట్లాడుకుంటాం'

గిడుగు వారు
'నేను సవర భాషలో మాట్టాడతాను..
ఆవిడకది అర్థంకాదు..
 సింపుల్ గొడవలేముంటాయ్..'

వేలూరు వారు
ఇంటికి దూరంగా కుటీరం నిర్మించుకొని వుంటారట..
గిడుగు వారింట్లో  గొడవలే లేవు
ఆవిడ అరిచి చచ్చినా వారికి వినపడదట..

బుచ్చిబాబుగారు
తెలియనివారు..
తెలిసిన వారు చెప్పినపుడు వినాలి
మా ఆవిడ 'మీకేం తెలీదు ఊరుకోండీ'
 అంటూ వుంటుంది
ఆవిడమాట మెదలకుండా వినటమే నాపని'

జమ్మలమడకవారు
'మనం సంస్కృతం నేర్చుకోవలె..
 ఆవిడకు అర్థంకాదు. .'
సో ..గొడవలు బంద్..
ఈ విధంగా తన గొడవతో
మొత్తం సాహిత్య లోకపు గుట్టునంతా విప్పేసారు మునిమాణిక్యం గారు

అంటే ఈనాడే కాదు ఆనాటినుంచీ కూడా ఇవేపధ్ధతులన్నమాట ప్రశాంత జీవనానికి..
హోం మినిష్టర్ పదవా మజాకా.. అనిపించింది నాకు

పైన మునిమాణిక్యం గారు వినిపించింది
 నిజమో ..లేక కేవల హాస్యమో తెలియదు కాని..

బయట ఎంత పెన్ను తిప్పినా 
ఇంట్లో వీరంతా పిల్లులేనన్నమాట..

ఇదంతా చదివాక 
మా ఇల్లు గుర్తొచ్చిందినాకు
మా ఇంటి వాతావరణమూ పధ్ధతి 
అందరికంటే ఎంత భిన్నం ..

''చెలిమి పండగ నొక్క చీర దెచ్చితినేమి
కలిమి యొకనాడైన గడప ద్రొక్కినదేమి
మురిపంబు దొలుకాడ ముద్దులాడితినేమి..''

మా అమ్మను తలుచుకుంటే పై పాదాలే గుర్తుకొస్తాయి

''ఆభరణములు లేని దది వింత సొబగయ్యి 
మల్లెపూవట్ట్లు నా మగువ నవ్వినయపుడు
పట్టపగలే ఇంట పదివేల దీపాలు
వెర్రిబాగుల చాన వెన్నవంటీమనసు
దులకింప తోక చుక్కలవంటి కనులతో చూచెనా పదివేలు''

మా అమ్మ రూప వర్ణన ఇది
ఇక గుణ వర్ణన 

''నాపడతి యగుదాన నాతి యొకనాడైన
నిట్టూర్చెనా మారు బట్టలేని దినాల సిగ్గువోవు దినాల''

నేను మా అమ్మను చూచి 
నా జీవితం దిద్దుకున్నాను
నాకు తోచిన ఒకే పదం' సారీ'
ఎవరిది తప్పైనా అదే పదం నన్ను ఆదుకుంది

మా అమ్మ ఇంతకన్నా కష్టపడిందిగదా..
నా కష్టం ఏపాటి..
అని మా అమ్మను స్మరించుకొని 
ముందుకు సాగుతూ 
ఈరోజు ఇలా వున్నాను.

నిజంగా ఆ సారీ
ఎన్ని సారీలను తిరిగి ఇస్తుందను కున్నారు..
ఆ సారీ  ..
శారీలు గా  , బంగారు ఆభరణాలు గా ,
 ఎన్నో బహుమతులుగా
మధుర స్మృతులు గా మా వారు..
మా  సన్నిహితులూ మార్చేస్తుం టారు ..
నిజంగా సారీలో మేజిక్ లేదూ ..



31 అక్టో, 2015

పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి రచనలు నా జీవి వున్నంతలో అందరికీ అందుబాటులో వుంచాలని తపన పడ్డాను. telugu thesis వారికి రిక్వెస్ట్ చేస్తూ మైల్ చేస్తే వారు ఎంతో ఆదరించారు..నేను పంపిన కంచి కామకోటి సంపాదకీయాలు ప్రచురించారు . ఇంకా పంపితే ప్రచురిస్తామన్నారు. ఇప్పుడు Teluguthesis.com లో పుట్టపర్తి గ్రంధాలు చాలావరకు లభ్యమవుతాయి.
మిత్రులారా.. పుట్టపర్తి పండరీ  భాగవతం విశ్వనాధ వెన్నోళ్ళ పొగడినది బయటికి తేవటమెలా చాలా పెద్ద పుస్తకం స్కానింగ్ చేయటం చాలా పెద్ద పని అనుకుంటూ వుంటిని అది ఈ రోజు నాకు అక్కడ దర్శనమిచ్చింది వెంటనే లింక్ తీసుకున్న్నాను. ఇదిగో..
ఇకపై పుట్టపర్తి పై పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి.. నా ఉడుతాభక్తిని దేవుడు అప్యాయంగా చేకొన్నాడు. 

                                                                                                              ముందుమాట
ఈ పండరీ భాగవత గ్రంధకర్త మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ శ్రీమాన్ పుట్టపర్తి నారాణాచార్యులు గారు. ఈయన ఈ గ్రంధం వ్రాసి ముప్పదియేండ్లైనదట.. ఈయన కీర్తి అంతకు ముందే మొదలుపెట్టినది. ఈ గ్రంధము మాత్రమిప్పుడు వెలికి వచ్చినది. ఇందులో పుండరీక చరిత్ర,చోకామీళుని కథ, నామదేవ చరిత్రము,గోరాకుంభారు కథ, నరహరి చరిత్రము అన్న అయిదు కథలు కలవు. మొదటి కథ పేరే ఇది. పండరీక్షేత్రమునందలి మహాభక్తుల కథల సంపుటి.
ఇది ద్విపదకావ్యము. పూర్వము మన దేశములో కొన్ని ద్విపద కావ్యములు కలవు. కొన్నింటికి కొంత మర్యాద కలదు. వేణుగోపాల శతక కర్త ద్విపద కావ్యములందు మర్యాద లేనివాడు. దానికి కారణమేమయి వుండును ? పద్యమునందున్న వైశాల్యము ద్విపదకు లేదనవచ్చును. ఒక లోతైన భావము ఒక విస్తారమైన భావము రచనా శిల్పముచేత మూర్తి కట్టించుటకు తగినంత వీలైన లక్షణము ద్విపదలో లేదని యాతడెంచినాడేమో..
కాని మన దేశములో స్త్రీల పాటలన్నియు ద్విపదలో నున్నవి. బసవ పురాణమునకు గౌరన హరిశ్చంద్రకు గల ప్రశస్తి కాదనుటకు వీలులేదు. రంగనాధ రామాయణము ద్విపద గ్రంధము. ద్విపద భారతమన్న గ్రంధము ఆంధ్ర విశ్వ విద్యాలయము వారు పూర్వమచ్చొత్తించిరి. అంద్లో చాల భాగము తిక్కన్న గారి పదాలు ద్విపదలో వ్రాసినట్లుండును. పద్య రచనకు ద్విపద రచనకున్న భేదము ఆ రెంటిని పోల్చి చుచినచో తెలియ గలదేమో..
ద్విపద యనిన తోడనే ఒక తాళము రెండు చరణములతో చెప్పదలచిన భావమైపోవుట. పాటకు వీలుగా నుండుట. సర్వ జనులకు చదువుటకు వీలుగా నుండుట మొదలైన లక్షణములుండవలసినట్లు కనిపించవచ్చును.
ఈ కావ్యములో నా లక్షణములు చాల నున్నవి. కాని ప్రౌఢి కూడా నున్నది. కొన్ని చోట్ల దీర్ఘ సమాసములు కలవు. ప్రతి చరిత్రకు చివర కవి తన కథ కొంత చెప్పి కొనుచుండెను. దాని వలననే కవిని గురించిన వాకబు చాల తెలియగలదు. 
ఈయన వ్రాసిన గ్రంధము పూర్వ ద్విపద కావ్యముల కేమియును తగ్గిపోదు. తగ్గిపోదు సరికదా కొన్నిచోట్ల పూర్వ ద్విపద రచనకు మెరుగు పెట్టినట్లుండును. 
ఈతడు కొన్నివిషయములలో నాకంటే ఘనుడు. అయినను ఈ రచనపై నా అభిప్రాయమడుగుట కేవలము స్నేహధర్మమని భావించుచున్నాను.
విశ్వనాధ సత్యనారాయణ


పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

అందుకే ఆయన ఉక్కు మనిషి



ఒక సభ అది
పుట్టపర్తి ఉపన్యాసం ముగిసింది
శ్రోతలు ఒక రకమైన సమ్మోహనత్వం లో ఉన్నారు
పుట్టపర్తి తమ వాడని ప్రతి వారి హృదయం ఉప్పొంగిపోతూంది
రాయల కాలం నాటి  రక్తం ఏదో 
వారి నరాలలో వడి వడిగా పరుగులెత్తుతున్న ఉద్వేగం
ఇంతలో 
ఎవరో ఒక చీటీ తెచ్చి పుట్టపర్తి వారి కిచ్చారు
అందులో ఏముంది..??

సభకు విచ్చేసిన వారిలో ఒకరు అపర కుబేరుడు నాలుగు   పద్యాలతో అతన్ని ప్రస్తుతిస్తే..
మీ అముద్రిత కావ్యాలకు మోక్షం వస్తుంది..

మరి పుట్టపర్తి యేం చేశారో తెలుసా..

'' పరుల ప్రశంస జేసి నవభాగ్యములందుటకంటే 
నాత్మసుస్థిరుడయి పున్క పాత్రమున దిన్నను 

నా మది జింతలేదు 
శ్వరు గుణ తంద్ర గీతముల 
పాడుచు , జిక్కని పూవువోలె
నా పరువము వాడకుండ 
ఇలపై మని రాలిన జాలు సద్గురు..''
 చీటీ వెనుక ఆ పద్యం రాసి తిరిగి పంపేసారు 


 
  ఈ నియమాన్ని జీవితాంతం పాటించారు పుట్టపర్తి
ఎంతో మంది ధనలక్ష్మీ పుత్రులు 
పుట్టపర్తి కావ్య కన్యల పాణిగ్రహణానికి సిధ్ధపడినా 
ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి
పురం బులు .. వాహనంబులున్ ..
 సొమ్ములు  కొన్ని గొని ..
చొక్కి..  శరీరము వాసి .. 
కాలుచే సమ్మెట వాటులం బడక'

ఆ శ్రీనివాసునికిచ్చిన..పుట్టపర్తి పోతన వారసత్వం 
అమర లోకాలకు వెళ్ళిపోయింది..

ప్రతి మనిషికీ ఒక సందర్భం వస్తుంది
అది నీవెలాంటి వాడివో నిరూపించుకోవలసిన పరీక్ష.
అందులో 
సామాన్యులకు భిన్నంగా స్పందించినవారే.. మహనీయులు అవుతారు

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి అట
సంబరాలు చేసుకుంటున్నారు

ఆయన జీవితంలో ఒక సందర్భం

ఒకసారి సర్దార్ కోర్ట్ లో వాదిస్తున్నారు
కేసు కీలకంగా ఉంది
వాదన జరుగుతూంది..
నువ్వా నేనా అన్నట్లు..

ఇంతలో ఒక టెలిగ్రాం ..సర్దారుకు..
ఎవరో తెచ్చి ఇచ్చారు 
సర్దారు దాన్ని విప్పి చదివి.. మడిచి కోటు జేబులో పెట్టుకున్నారు
కేసు యధావిధిగా సాగింది

తరువాత కుప్ప కూలిపోయారు
అది వారి భార్య చనిపోయిన వార్త
కానీ క్రితం వరకు జరిగిన వారి వాదనలో 
వారి గొంతు చెక్కు చెదరలేదు
 వాదనలో పదును తగ్గలేదు
వృత్తే దైవం వారికి
రజాకారుల దుష్కృత్యాల నుంచీ 
నిజాం నవాబుల చేతుల నుంచీ 
హైదరాబాద్ సంస్థానాన్ని విడిపించిన ఘనుడు ఈయన 

రాజ కీయాలలో  ఇటువంటి విలువలు పాటిస్తున్న నాయకు లుంటే  మనకు స్వర్ణాంధ్ర ,
బంగారు తెలంగాణ అసాధ్యమా.. 

ఇంకో విషయం .. 
పటేల్ ఉప ప్రధాని గా వుండగా ఆయన కుమారుడు 
అవినీతికి పాల్పడే వాడ ట .. 
అది తెలుసుకున్న పటేల్ పరిశ్రమల శాఖా మంత్రికి ఒక లేఖ వ్రాసారు.. 
ఏమని.. 
కొడుకు అవినీతితో తనకు సంబంధం లేదని 
అతనిపై ఎటువంటి చర్య అయినా తీసుకొమనీ.. 
చూసారా.. 
చివరి దశలో కూడా కొడుకు ముఖం చుడటానికి ఇష్ట పడక స్నేహితుని వద్ద కన్ను మూసారట.. 

అందుకే కాలాలు వెళ్ళిపోయినా
పుట్టపర్తి వారన్నట్టు 
మృత్యుదేవతకు వారిని తాకే అధికారం  ఉండదు
అందుకే ఆయన  ఉక్కు మనిషి
మరి పుట్టపర్తి మార్గం అందుకు భిన్నమా మీరే చెప్పండి..