11 ఏప్రి, 2017

'రాస్కోరా సాంబా,,'


ఇంటికో వుద్యోగం .. పేదలకు ఇళ్ళు..
ఇరవైనా లుగ్గంటలూ విద్యుత్తూ..
వాగ్దానాల వరాలు ఎన్నికల సమయంలో నాయకుల నోట్లో పొంగి పొర్లుతుంటాయి
అందులో నెరవేరేవెన్నో ఎవ్వరికీ తెలియదు 
ఆఖరికి వాళ్ళకు కూడా
ఒక్కొక్క నాయకుడి ఆస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగి పోతుంటాయి
పేదలు పేదలే ఎప్పటికైనా..

పొద్దున్నే పేపరు తెరిచినా టీవీ ఆన్ చేసినా 
ఒకటే వార్తల వరద..
అలంకానిపల్లె నుంచీ అమెరికా దాకా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మరునిమిషంలో 
అది breaking news
ఇవేవీ లేనికాలం ఎలా వుండేది..

బాహుబలి ..గౌతమిపుత్ర.. 
వీటివలన మళ్ళీ జనాల్లో ఆ గుర్రాలు ఆ డేరాలు ఆ యుధ్ధాలు మళ్ళీ గుర్తొచ్చాయి..

రాజు గుర్రం పై ఏ ఊరెళ్ళినా .. 
వెనకే వందమంది పరివారం
వాళ్ళలో  లేఖకులొకరు
రాజెక్కడికి పోయినా పుస్తకా లకెక్కించడమే వారిపని
మంతనాలు..  రాజకీయాలు ..దానాలు.. హెచ్చరికలు 
ఓహ్ ..
ఒకటేమిటి
లేఖకుడు అన్నీ ఎక్కించేవాడు రికార్డుల్లోకి 
'రాస్కోరా సాంబా,,' అంతే
రాజు కార్యక్రమాలన్నీ వారి డైరీల్లో నిక్షిపమై వుండేవి..
ప్రజలు రాజు దైవంశ సంభూతుడని నమ్మినా 
రాజు తోచినట్లు ప్రవర్తించేది వారు కాదట .. 
అందుకు కారణం . 
నైతిక ఆధ్యాత్మిక శక్తులు .. 
ఇప్పుడు లేనివే అవి.. 
పుట్టపర్తి విజయనగర సామాజిక చరిత్ర లో విషయాలివన్నీ .. 




''చక్రవర్తికి కూడ ప్రత్యేక విలేఖరులుందురు..

ఊరు వదలినప్పుడు చక్రవర్తి వీరిని వెంట బెట్టుకొని పోవును..
రాజేదేన మాటాడును..
వారు వెంటనే దస్త్రములకెక్కింతురు.. 
ఎవరెవరిని జూచినది
యే విషయముల చర్చించినది..
యే నిర్ణయమునకు వచ్చినది
సమస్తమును వారు వ్రాసి పెట్టుదురు..
ప్రభువిచ్చిన దానములను గూడ వారు గుర్తువేతురు..
వీరికా రాజ్యమున గొప్ప గౌరవము..
ప్రసక్తి వచ్చినపుడు వారు దమవ్రాతలలోనుండి ప్రభువునకు విషయములందింతురు..
ఏ యాజ్ఞ కాని ..
రా జు వ్రాసి యివ్వడు..
దానము గూడనంతే..
అతనిది మాట.. 
వీరిది వ్రాత..
మరి ప్రతిగ్రహీతకు గుర్తేమి..?? 
చక్రవర్తి యుంగరమునకు బ్రతికృతులు కొన్ని మహాప్రధాని కడనుండును..
నాతడొకదానిని లక్కపై ముద్రించి దానము గ్రహించిన వారి కొసగును..
అతనికంతే గురుతు..
దాన వివరములు పొత్తములలో నుండును..
మహామంత్రి రాజుమొహరుల నాధికర పత్రములపై వాడును.''