12 మే, 2017

పరమ భాగవతుల పాదసేవ .. (పుట్టపర్తి కీర్తి శిఖరాల మాట గరికపాటి నోట..)


నవజీవన వేదంలో  
గరికపాటి నోట సరస్వతీ పుత్ర పుట్టపర్తి 
ప్రస్తావన వచ్చింది. 

ఈ కాలంలో నాలుగు అవధానాలు చేసినా... 
నాలుగు ప్రవచనాలు చెప్పినా 
అతణ్ణి సరస్వతీ పుత్రుడు ..
వాణీ పుత్రుడు.. 
శారదా జ్ఞాన పుత్రుడు అంటూ బిరుదాలు ఇచ్చి పరవశిస్తూ వుంటారు..
 వారి పేరు ముందా బిరుదు వారికి వన్నె తెస్తుందేమో 
కానీ ఆ బిరుదానికే వన్నె వచ్చేది 
అది తగినవ్యక్తి చెంత చేరినప్పుడు మాత్రమే..  


నిజానికి ఈ సరస్వతీపుత్ర బిరుదము 
ఎక్కడో హిమాలయాలలో 
తత్త్వ శోధన చేస్తున్న 
మౌని జ్ఞాని తపస్వి అయిన 
స్వామి శివానంద సరస్వతుల వారిచే 
పుట్టపర్తి వారికి 
పదునాల్గు భాషలలో పాండిత్యాన్ని 
బాగా పరీక్షించిన తదుపరి 
ఆనంద పరవశులై ప్రదానం చేయడం జరిగింది.

పుట్టపర్తి వారు  దేశంలోని 
అనేక కవులు  యోగులు అవధూతలు 
మొదలైన వారిని కలుస్తూ.. 
భగవదన్వేషణలో 
జీవితంపై విరక్తి చెంది పర్యటిస్తూ 
తనకు తృప్తి కరమైన సమాధానం దొరకని కారణంగా విసిగి వేసారి  ప్రాణత్యాగానికై 
ఆ మంచు కొండలనెక్కారు. 

వెంటనే స్వామి శివానంద ద్వారా 
వారి అన్వేషణకు ఒక సమాధానం దొరికింది.
 పుట్టపర్తి వారిని స్వామివారు తమ ఆశ్రమంలో 
కొన్ని నెలలు వుంచుకుని అన్ని శాస్త్రాలలోనూ 
వారి పాండితికి సంతుష్టులై 
'సరస్వతీపుత్ర '
అనే బిరుదాన్ని శిష్యవాత్సల్యంతో ఇచ్చారు..

నాకీ బిరుదులు యేమీ వద్దు 
ఎన్ని కోట్ల నామజపం చేసినా 
ఎటువంటి అనుభూతి కలుగలేదు..
 ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి 
అని పుట్టపర్తి నివేదించగా 

'నీకు నీ జీవిత అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది' అని వాగ్దానం చేసారు. 
అదే వాగ్దానాన్ని కంచి పరమాచార్యులైన 
నడిచేదైవం అని పేర్గాంచిన 
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులవారు 
పుట్టపర్తికి మళ్ళీ ఇచ్చారు..

శివానందుల వారు నీవు నాపైని అభిమానంతో 
ఈ బిరుదాన్ని స్వీకరించవలసింది అని కోరారట.
అంత గంభీరమైన ఉదాత్తమైన నేపధ్యం కలిగినదీ సరస్వతీపుత్ర అనే బిరుదం.. 
తరువాతి కాలంలో 
పుట్టపర్తి వారిని ఎన్నో బిరుదాలు వరించినా అవి అక్కడే మర్యాద పూర్వకంగా తిరిగి ఇచ్చివేసిన సందర్భాలు వున్నాయి పుట్టపర్తి వారి జీవితంలో.. 

కానీ పరమ యోగి పుంగవులైన 
స్వామి శివానందులవారిపై గౌరవంతో 
ఒక్క సరస్వతీపుత్ర అన్న బిరుదాన్ని మాత్రం 
వారు తమ పేరులో వుంచుకోవటం జరిగింది.

అప్పటినుంచీ అది పుట్టపర్తి వారికి మరింత శోభనద్ది తనను తాను శోభితం చేసుకుంది.
ఇదే విషయాన్ని మహా సహస్రావధాని గరికపాటివారు వివరించారు.. 
సరస్వతీపుత్ర ఆంద్ర దేశం లో ఒక్క పుట్టపర్తి నారాయణాచార్యులు వారికే వుంది 
ఇంకెవ్వరికీ అది శోభించదు ,
అంటూ వాక్రుచ్చారు .. 

-పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ.